Tragedy | అన్నపురెడ్డిపల్లి, జూన్ 7: లారీ డ్రైవర్గా పనిచేసే భర్త మద్యానికి బానిసయ్యాడు. తాగొచ్చి తరచూ భార్యతో గొడవపడడంతో ఆమె తట్టుకోలేక ఉరి వేసుకుని మృతిచెందింది. రోజు వ్యవధిలోనే భార్య మరణాన్ని తట్టుకోలేక పురుగుల మందుతాగిన భర్త చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన మండలంలో బుధవారం చోటు చేసుకున్నది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. జానకీపురం గ్రామానికి చెందిన కోలా అఖిల(21), వెంకటేశ్వరరావు(28) దంపతులది నిరుపేద కుటుంబం. వీరి దాంపత్య జీవితంలో ఇద్దరు పిల్లలు జన్మించారు. లారీడ్రైవర్గా పనిచేసే వెంకటేశ్వరరావు మద్యానికి బానిసయ్యాడు.
ఈ క్రమంలో ఇంట్లో తరచూ భార్యాభర్తల మధ్య కొద్దిరోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. దీంతో తట్టుకోలేక భార్య అఖిల మంగళవారం ఇంట్లో ఉరి వేసుకుని మృతిచెందింది. భార్య లేని జీవితం వ్యర్థమని భావించాడో.. నువ్వు లేనిదే నేను ఉండలేనను కున్నాడేమోగానీ అదేరోజు పురుగుల మందుతాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వెంకటేశ్వర్లు చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. దీంతో మూడేళ్ల నరేంద్రబాబు, ఏడాది వయసున్న అక్షిత్కుమార్ అనాథలుగా మారారు. భార్యాభర్తలు ఇద్దరూ మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.