ఊరూ.. వాడా రంగుల పండుగను అంబరాన్నంటేలా చేసుకున్నారు. వయసు తారతమ్యాన్ని మరిచి.. స్థాయిలను విస్మరించి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సప్తవర్ణ రంగులను చేతులకు పులుముకొని ఆనంద డోలికల్లో మునిగి తేలారు. కేరింతలు కొడుతూ.. ఈలలు వేస్తూ.. నీళ్లు చల్లుకుంటూ.. డీజే మోతల నడుమ నృత్యాలు చేస్తూ రంగులు చల్లుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి కామ దహనాన్ని నిర్వహించి.. సోమవారం తెల్లవారుజాము నుంచే చిన్నారులు, యువతీ యువకులు రంగులతో స్నేహితులు, బంధువుల ఇళ్లకు తిరుగుతూ.. రంగులు పూసుకుంటూ అవధులు లేని సంతోషంతో సంబురంగా వేడుకలు జరుపుకున్నారు.
ఖమ్మం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ వీపీ గౌతమ్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఒకరిపై ఒకరు సంబురంగా రంగులు చల్లుకున్నారు. హోలీ పండుగను జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఖమ్మంలో మేయర్ పునుకొల్లు నీరజ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. భద్రాద్రి జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల, ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ దంపతులు, జిల్లా సంక్షేమ శాఖ అధికారి వేల్పుల విజేత కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో హోలీ వేడుకను ఘనంగా జరుపుకున్నారు. ఎస్పీ రోహిత్ రాజు హోలీ వేడుకల్లో పాల్గొని నృత్యం చేశారు. కలెక్టర్ పిల్లలు అంగన్వాడీ చిన్నారులతో కలిసి సరదాగా ఆడుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రియాంక మాట్లాడుతూ హోలీ పండుగ సంబురాలు ప్రజలకు చాలా ఆనందాన్ని పంచుతాయన్నారు. డీసీహెచ్ఎస్ రవిబాబు డప్పు కొడుతూ సంబురాల్లో పాలుపంచుకున్నారు.