‘తెలంగాణ ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా అమలు చేయడంలో భద్రాద్రి జిల్లా ముందు వరుసలో ఉంటోంది. ఈ క్రమంలోనే ఏటేటా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ పల్లెలను దేశం మెచ్చుకోగా.. నీతి ఆయోగ్ వంటి కేంద్ర ప్రభుత్వ విభాగాలు సైతం ప్రశంసిస్తున్నాయి’ అని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన కొత్తగూడెం ప్రగతి మైదానంలో మంగళవారం జరిగిన పంద్రాగస్టు వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి మాట్లాడారు.
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పల్లెలను దేశమే మెచ్చుకుంటోందని, నీతి ఆయోగ్ వంటి కేంద్ర ప్రభుత్వ విభాగాలు సైతం తెలంగాణ పల్లెలను ప్రశంసిస్తున్నాయని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. పేర్కొన్నారు. రాష్ట్రంలోని మారుమూల పల్లెలకూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమంలో భద్రాద్రి జిల్లా ముందువరసలో దూసుకుపోతోందని స్పష్టం చేశారు. జిల్లా కేంద్రమైన కొత్తగూడెం ప్రగతి మైదానంలో మంగళవారం జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో ఆయన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, కలెక్టర్ ప్రియాంక, ఎస్పీ వినీత్లు పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన ప్రభుత్వ సందేశాన్ని వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అర్హులకు అందించడంలో జిల్లా అధికారులు కృషి అభినందనీయమైనదని అన్నారు. ప్రతిష్ఠాత్మక దళితబంధు పథకంలో భాగంగా జిల్లాలో 421 మందికి రూ.42 కోట్ల యూనిట్లు అందించినట్లు చెప్పారు. ‘మన ఊరు మన బడి’ కింద జిల్లాలో 368 పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దినట్లు చెప్పారు.
దశాబ్దాల పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన ఘనత సీఎం కేసీఆర్దేనని ప్రభుత్వ విప్ స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా 50,595 మంది గిరిజన రైతులకు పోడు పట్టాలు అందించారని, వెంటనే రైతుబంధు సాయం పంపిణీ చేశారని, ఆ వెంటనే రైతుబీమాను కూడా అమలు చేశారని వివరించారు. భద్రాద్రి జిల్లాలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి రాష్ట్ర ప్రభుత్వం సీతారామ, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులను చేపడుతోందన్నారు. రైతుబంధు పథకం కింద జిల్లాలో 33,564 మంది రైతులకు రూ.203 కోట్ల పంటల పెట్టుబడి సాయాన్ని అందించినట్లు వివరించారు.
కొత్త మెడికల్ కాలేజీ రావడం జిల్లా ప్రజల, వైద్య విద్యార్థుల అదృష్టమని ప్రభుత్వ విప్ రేగా పేర్కొన్నారు. ఈ కళాశాలతో వైద్యం ప్రజలకు మరింత చేరువ అవుతుందని అన్నారు. భద్రాద్రి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలూ ప్రగతి పథకంలో కొనసాగుతున్నాయని అన్నారు.
ఈ సందర్భంగా ప్రగతి మైదానంలో నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియానాయక్, అదనపు కలెక్టర్ రాంబాబు, ఏఎస్పీ పరితోశ్ పంకజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీల చైర్మన్లు కాపు సీతాలక్ష్మి, డీ.వెంకటేశ్వర్లు, అన్ని శాఖల అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన స్టాళ్లను అతిథులు తిలకించారు. రుణాల చెక్కులను పంపిణీ చేశారు. కొత్త వాహనాలను ప్రారంభించారు. ఉత్తమ సేవలందించిన అధికారులకు,ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు.