ఖమ్మం అర్బన్, జూన్ 13 : విద్యాసంస్థలకు గుమ్మంగా పేరొందిన ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారి పోస్టు హాట్ కేక్గా మారింది. హైదరాబాద్ తర్వాత విద్యాసంస్థలకు అంతటి పేరున్న ఈ జిల్లాలో విధులు నిర్వర్తించేందుకు అధికారులు పోటీ పడుతుంటారు. అయితే ఇక్కడి డీఈవో సెలవులో ఉండటంతో ఇన్చార్జిగా మరో అధికారిని నియమించాల్సి ఉంది. ఆరోగ్య సమస్యలతో గత నెలలో 20 రోజులు సెలవు పెట్టిన డీఈవో ఈ నెల 5వ తేదీ విధుల్లో చేరారు. ఈ క్రమంలో ఈ నెల 12న మరోసారి ఉన్నతాధికారులకు సెలవు మంజూరు కోసం దస్ర్తాన్ని పంపినట్లు తెలుస్తోంది. ఈసారి ఎలాగైనా ఇతర జిల్లాల్లో ఉన్న ఎవరో ఒకరికి డీఈవో బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతానికి ఈ పోస్టు కోసం ఇద్దరు అధికారులు తమ స్థాయిలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
జిల్లా విద్యాశాఖను పూర్తిస్థాయిలో పట్టించుకోకపోవడంతో అంతా అగమ్యగోచరంగా మారింది. గత నెలలో 20 రోజులకు పైగా డీఈవో సెలవులో ఉన్నప్పటికి కనీసం ఎవరికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించలేదు. కార్యాలయంలో పనిచేస్తున్న సూపరింటెండెంట్ చావా శ్రీనివాసరావే పరిపాలనా విభాగాన్ని కొనసాగించారు. కొందరి ఉద్యోగుల జీతాలు, పాఠశాలల పునఃప్రారంభానికి కావాల్సిన చర్యలు తీసుకోవడానికి డీఈవో అదనపు బాధ్యతలు అప్పగించకపోవడంతో చాలా సమస్యలు ఉత్పన్నమయ్యాయి. దీంతో డీఈవో కార్యాలయంలో రోజువారీ సంబంధించిన దస్ర్తాలతోపాటు ఇతర దస్ర్తాలు అధిక సంఖ్యలో పెండింగ్లో ఉన్నాయి.
ప్రభుత్వ ఉన్నత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న హెచ్ఎంలకు సంబంధించిన ఇంక్రిమెంట్లు డీఈవో లేకపోవడంతో ఆగిపోయాయి. మే, జూన్ నెలల్లో ఇంక్రిమెంట్లు పొందాల్సిన ప్రధానోపాధ్యాయులు, ఉద్యోగ విరమణ పొందుతున్న ఉపాధ్యాయులకు సంబంధించిన ఎస్ఆర్లు పెండింగ్లో ఉన్నట్లు ఉపాధ్యాయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ దశలో ప్రభుత్వం కానీ, ఉన్నతాధికారులు కానీ స్పందించి ఎవరికి అదనపు బాధ్యతలు అప్పగించలేదు. ఈ నెల 15వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా.. ఉపాధ్యాయులకు సంబంధించిన సర్దుబాటు ప్రక్రియను ఇంకా పూర్తి చేయలేదు.