ఖమ్మం వ్యవసాయం, జూలై 22 : బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లావ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. గ్రామాల్లో ప్రజలు ఇంటి నుంచి బయటకు రాలేని వాతావరణం నెలకొంది. వర్షంతో మరోసారి సాగు పనులకు అంతరాయం కలిగింది. ఇప్పుడిప్పుడే పంట పొలాల నుంచి వర్షపు నీటిని బయటకు పంపి మొక్కలను రక్షించుకునే ప్రయత్నంలోనే వరుణుడు పగబట్టినట్లుగా వర్షం పడడంతో సాగు రైతులు నిరాశకు లోనయ్యారు. ఖమ్మం నగరంలో కురిసిన భారీ వర్షానికి ప్రధాన వీధులు జలమయమయ్యాయి. దీంతో ఆయా ప్రదేశాల్లో పాదచారులు, ద్విచక్రవాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కార్పొరేషన్ సిబ్బంది కాలువల ద్వారా వరద, మురుగునీటిని బయటకు పంపించారు. సెలవురోజు తరహాలోనే నగరంలో పలు షాపులు మూతపడ్డాయి. వివిధ అవసరాల కోసం నగరానికి వచ్చిన ప్రజలు అసౌకర్యానికి గురయ్యారు.
2.90 లక్షల ఎకరాలకు చేరిన వానకాలం సాగు
ఖమ్మం జిల్లావ్యాప్తంగా వానకాలానికి సంబంధించి 2,90,382 ఎకరాల్లో రైతులు సాగు చేపట్టారు. అత్యధికంగా పత్తిసాగు 2,01 276 ఎకరాల్లో సాగు కాగా.. 23,994 ఎకరాల్లో వరినాట్లు వేసుకున్నారు. అదేవిధంగా 350 ఎకరాల్లో కంది,798 ఎకరాల్లో మక్క, 1,024 ఎకరాల్లో పెసర విత్తనాలు విత్తుకున్నారు. మరో 60 వేల ఎకరాల్లో పచ్చిరొట్ట విత్తనాలను రైతులు చల్లుకున్నారు. ఈ నెల ప్రారంభం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తుండడం, సకాలంలో రైతుబంధు సొమ్ము చేతికి అందడంతో సాగు పనులు వేగవంతమయ్యాయి. వర్షాలతో మిర్చితోటల సాగు, మిర్చినారుమళ్లకు ఇబ్బందులు వస్తున్నాయి.
కూసుమంచిలో
శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మండల వ్యాప్తంగా భారీ వర్షం పడింది. కూసుమంచి గంగదేవి చెరువు, జీళ్లచెరువు కొండలమ్మ చెరువుకు వరద నీరు చేరి నిండుతున్నాయి. పాఠశాల విద్యార్థులు యథావిధిగా ఉదయం పాఠశాలలకు వెళ్లడంతో వర్షం కారణంగా ఇళ్లకు పంపారు.
కూసుమంచి రూరల్లో..
మండలంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. నాలుగైదు రోజులుగా పొడి వాతావరణం ఏర్పడి, ఉష్ణోగ్రత పెరిగింది. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు జరిగి, భారీగా వర్షం కురవడంతో వ్యవసాయ పనులకు ఆటంకం ఏర్పడింది. మరో నాలుగు రోజుల వరకు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
తిరుమలాయపాలెంలో..
మండలంలో శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాలేదు. వ్యవసాయ పనులకు ఆటంకం ఏర్పడింది. పంట చేలల్లో వర్షపు నీరు చేరింది. వర్షాలు పడడంతో పంటలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఖమ్మం రూరల్లో..
శుక్రవారం మండలంలో వర్షం విస్తారంగా కురిసింది. తెల్లవారుజాము మొదలు రాత్రి వరకు వర్షం పడుతూనే ఉంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రస్తుత సీజన్లో సాగు చేసిన పంట పొలాలలో కలుపుతీత పనులు జరుగుతుండగా ఏకధాటిగా కరిసిన వర్షానికి వ్యవసాయ పనులకు తీవ్ర అంతరాయం కలిగింది. ఏదులాపురం గ్రా మంలోని ఎస్సీ కాలనీ సమీపంలోకి వరదనీరు చే రడంతో ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
నేలకొండపల్లిలో..
శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురిసింది. పలు గ్రామాల్లో భారీ వర్షానికి నీరు ఇళ్లల్లోకి చేరింది. రాజేశ్వరపురంలో డబుల్ బెడ్రూం ఇళ్ల చుట్టూ భారీగా వరద నీరు రావడంతో ఇళ్లలోని వారు బయటకు రాలేకపోయారు. బోదులబండలో చాలా మంది ఇళ్లల్లోకి నీరు రావడంతో బయటకు పారబోశారు.
బోనకల్లులో..
భారీవర్షానికి రోడ్లు వాగులు శుక్రవారం జలమయమయ్యాయి. వర్షానికి ఫ్లైఓవర్బ్రిడ్జి పక్కన ఉన్న రోడ్డు జలమయంగా మారింది. వాహనదారుల రాకపోకలకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
చింతకానిలో..
మండలంలో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా మోస్తరు నుంచి భారీవర్షం కురిసింది. చెరువులన్నీ మత్తడి పోస్తున్నాయి. పత్తిపంట పాటు దశలో ఉండగా రైతులు ట్రాక్టర్లతో పాట్లు చేయిస్తూ, కలుపులు తీయిస్తున్నారు. పొలాల్లో నిలిచిన వర్షపు నీటిని రైతులు బయటకు పంపిస్తున్నారు. వర్షానికి పత్తి పైరు పసుపు రంగులోకి మారుతోంది.
పాలేరుకు పోటెత్తిన వరద
పరిశీలించిన ఎమ్మెల్యే కందాళ
కూసుమంచి, జూలై 22 : పాలేరు రిజర్వాయర్కు మళ్లీ వరద పోటెత్తింది. ఎగువన పడుతున్న వర్షాలకు 10వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా 23 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం దాటి నీరు వచ్చి చేరుతున్నది. సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలో పడుతున్న వర్షాలకు భారీగా వరద వచ్చి చేరుతున్నది. గురువారం పాలేరు నుంచి దిగువన ఆయకట్టుకు వానకాలం పంటలకు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ నీటిని విడుదల చేశారు. గురువారం సాయంత్రానికి 22అడుగులకు తగ్గిన పాలేరు శుక్రవారం పడిన వర్షంతో మళ్లీ పొంగిపొర్లుతున్నది. సీఈ శంకర్నాయక్, ఎస్ఈ నర్సింహారావు, ఈఈ సమ్మిరెడ్డి, డీఈ రమేశ్రెడ్డి పాలేరును పరిశీలించారు. ఎగువ నుంచి ఇంకా భారీగా వరద వచ్చి చేరే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తం అయ్యారు. వరద నీటితో పాలేరు నిండుకుండలా మారింది.
పరిశీలించిన ఎమ్మెల్యే కందాళ
పాలేరు రిజర్వాయర్ను ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి శుక్రవారం రాత్రి పరిశీలించారు. వర్షాలకు వస్తున్న వరద, పాలేరు నుంచి విడుదల అవుతున్న నీరు, నీటిమట్టం వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు మరింతగా వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎమ్మెల్యేతోపాటు డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, సీడీసీ చైర్మన్ నెల్లూరి లీలా ప్రసాద్, నాయకులు మల్లీడి వెంకటేశ్వరరావు, దేవేందర్రెడ్డి, సర్పంచ్ కాసాని సైదులు పాల్గొన్నారు.