రఘునాథపాలెం, జూలై 20: ఖమ్మం జిల్లాలో సోమవారం సాయంత్రం కురిసిన వర్షం అన్నదాతల్లో సంతోషాన్ని నింపింది. ఎల్నినో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పత్తి, వరి పంటలను సాగు చేసిన రైతులు వర్షాల్లేక దిగాలు చెందుతున్నారు. కొద్ది రోజులుగా వరుణుడి రాక కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలో పలు గ్రామాల్లో రైతులు వరుణుడి కరుణ కోసం గ్రామదేవతలకు పూజలు చేశారు. బొడ్రాయి, మైసమ్మ, ముత్యాలమ్మ దేవతలకు నీళ్లు పోశారు. వర్షాలు కురవాలని మొక్కులు సైతం మొక్కుకున్నారు.

ఈ క్రమంలో సోమవారం సాయంత్రం కురిసిన వర్షం రైతన్నల్లో కూసింత ఊరటను కలిగించింది. సాయంత్రం నుంచి మొదలైన వర్షానికి ‘హమ్మయ్య..’ అంటూ ఊపిరి పీల్చుకున్నారు. రాత్రంతా కురిసిన వర్షం అన్నదాతల్లో మనోధైర్యాన్ని నింపింది. కాగా, కొద్ది రోజులుగా తీవ్రమైన ఎండలకు అల్లాడిన జనం సోమవారం కురిసిన వర్షంతో ఉపశమనం పొందారు.

‘వర్షాలు కురవాలి దేవుడా..’ అంటూ అన్నదాతల కోసం వేడుకున్న జనం.. వాతావరణంలో మార్పులు చోటుచేసుకొని కురిసిన వర్షానికి సంతోష పడ్డారు. కాగా, వర్షం కారణంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఖమ్మం నగరంలో పాత బస్టాండ్ సమీపంలో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. రోడ్లపైకి వర్షం నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
