దమ్మపేట, డిసెంబర్ 10 : ఏజెన్సీ మండలమైన దమ్మపేటలో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జీసీసీ ఆధ్వర్యంలో దమ్మపేట, గండుగులపల్లి, గణేశ్పాడు, మొద్దులగూడెం, జగ్గారం, మల్కారం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా మండలంలో 120మంది రైతుల నుంచి ఇప్పటివరకు సుమారు 8వేల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అన్ని సదుపాయాలు ఉండడంతో రైతులు తమ ధాన్యాన్ని తీసుకువచ్చి విక్రయిస్తున్నారు.
రహదారి పక్కన, కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని ఆరబోసి అక్కడే యంత్రం సాయంతో తూర్పార బట్టి 17శాతం తేమతో అమ్ముతున్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని బస్తాల్లో నింపి దమ్మపేటలోని దుర్గామాత, శివశంకర్ రైస్మిల్లర్లకు అధికారులు తరలిస్తున్నారు. ఎప్పటికప్పుడు ధాన్యాన్ని తరలించి రైతుల వివరాలను పూర్తిచేసి వారంరోజుల్లో నగదు జమయ్యేలా చూస్తున్నారు.
రైతులకు ఇబ్బందులు లేవు
ప్రభుత్వం జీసీసీ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. ధాన్యం ఆరబోసేందుకు కేటాయించిన స్థలాల్లో వారికి అవకాశం కల్పిస్తూ అక్కడే కొనుగోలు సాగిస్తున్నాం. 15రోజులుగా విక్రయాలు జరుగుతున్నాయి. కొనుగోలు చేసిన ధాన్యాన్ని సంబంధిత రైస్మిల్లర్లకు వెంటనే పంపిస్తున్నాం. ఈ ఏడాది సుమారు 9,700 ఎకరాల్లో వరి సాగు చేయగా 4,537 మంది రైతుల పంట చేతికి వచ్చింది. ఏ-గ్రేడ్ క్వింటా రూ.2060, కామన్ రకం రూ.2040 మద్దతు ధర అందిస్తున్నాం. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు. వారంరోజుల్లో నగదు నేరుగా రైతుల అకౌంట్లలో జమ అవుతున్నది.
– సుగ్గల నర్సింహారావు, జీసీసీ మేనేజర్, దమ్మపేట