ఖమ్మం వ్యవసాయం, మే 22:తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నది. సాగు మొదలు పంట చేతికొచ్చి విక్రయించే వరకూ అన్ని విధాలుగా అండగా ఉంటున్నది. పంటల పెట్టుబడికి ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా ‘రైతుబంధు’తో భరోసా కల్పిస్తున్నది. పండించిన పంట దళారుల పాలు కాకుండా ‘మద్దతు’గా నిలుస్తున్నది. ఇందులో భాగంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్న సర్కార్.. మరో ముందడుగు వేసింది. మొక్కజొన్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సీఎం కేసీఆర్ రైతుపక్షపాతిగా నిలిచారు. ఖమ్మం జిల్లావ్యాప్తంగా రైతుల నుంచి 50-60 వేల మెట్రిక్ టన్నుల మక్కలను కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యం నిర్దేశించుకోగా.. 35 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలనుకున్నారు. ఇప్పటివరకు 24 కేంద్రాలు ప్రారంభం కాగా& పీఏసీఎస్, డీసీఎంఎస్ కేంద్రాలు కలిపి 12,119 మెట్రిక్ టన్నుల మక్కల సేకరణ పూర్తయింది.
ఖమ్మం జిల్లాలో మక్కల కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా కొనసాగుతున్నది మొదట్లో వర్షాల కారణంగా మందకొడిగా సాగిన ప్రక్రియ ఇప్పుడు జోరందుకున్నది. ప్రస్తుతం ఎండలు బాగా కాస్తుండడంతో కల్లాలో మక్కలు ఆరబెట్టుకోవడానికి అనువైన వాతావరణం ఏర్పడింది. దీంతో చకచకా మక్కల సేకరణ జరుగుతున్నది. కొనుగోలు ప్రక్రియను ఎప్పటిప్పుడు మంత్రి అజయ్కుమార్ సమీక్షిస్తున్నారు. కలెక్టర్ వీపీ గౌతమ్ కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. మార్క్ఫెడ్ ఉమ్మడి జిల్లా మేనేజర్ ఎం.సునీత క్షేత్రస్థాయిలోకి వెళ్లి కేంద్రాల్లో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. వీరికి తోడు డీసీఎంఎస్ సిబ్బంది, సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్లూ చొరవ తీసుకుని మక్కల సేకరణ ప్రక్రియ సజావుగా జరిగేట్లు చూస్తున్నారు.
కేంద్రాల వారీగా కొనుగోళ్లు ఇలా…
అధికారులు ఇప్పటివరకు చింతకాని మండలంలో ఏర్పాటు చేసిన పీఏసీఎస్ కేంద్రాల నుంచి 3,633 మెట్రిక్ టన్నులు, కొణిజర్ల మండలం నుంచి 2,374 మెట్రిక్ టన్నులు, ముదిగొండ నుంచి 490 మెట్రిక్ టన్నులు, వేంసూరు నుంచి 612 మెట్రిక్ టన్నులు, ఖమ్మం అర్బన్ నుంచి 58 మెట్రిక్ టన్నులు, రఘునాథపాలెం నుంచి 50 మెట్రిక్ టన్నులు, బోనకల్ నుంచి 3,528 మెట్రిక్ టన్నులు, నేలకొండపల్లి మండలం నుంచి 1,027 మెట్రిక్ టన్నులు, డీసీఎంఎస్ పరిధిలో ఏర్పాటు చేసిన ఏడు కేంద్రాల నుంచి 831 మెట్రిక్ టన్నుల మక్కలను కొనుగోలు చేశారు. మక్కలు సేకరించిన కొద్ది రోజుల్లోనే రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తున్నారు. ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ.75 లక్షల వరకు జమయ్యాయి.
పారదర్శకంగా కొనుగోళ్లు..
మక్కల కొనుగోలు కేంద్రాల్లో క్రయవిక్రయాలు పారదర్శకంగా కొనసాగుతున్నాయి. యాసంగిలో 13 మండలాలకు చెందిన రైతులు 91,225 ఎకరాల్లో మక్కలు సాగు చేశారు. రైతులు పండించిన పంట కొనుగోలు బాధ్యతను నోడల్ ఏజెన్సీ అయిన మార్క్ఫెడ్కు అప్పగించింది. మార్క్ఫెడ్ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సొసైటీ, డీసీఎంఎస్ల పరిధిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. సేకరించిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు అధికారులు ఇప్పటికే 20 వేల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం ఉన్న గోడౌన్లను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అవసరమైనతే సూర్యాపేట జిల్లా పరిధిలోని 40 వేల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం గల గోడౌన్లనూ వినియోగించనున్నారు. ఈ మేరకు వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి అనుమతులు తీసుకున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో రైతులకు దళారుల బెడద తప్పింది. మక్కల సేకరణకు మార్క్ఫెడ్ ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు కొనుగోళ్లను ఆన్లైన్ చేస్తుండడంతో మక్కల సేకరణ ప్రక్రియ సజావుగా సాగుతున్నది. మక్కలు పండించిన రైతుల వివరాలు అప్పటికే ఆన్లైన్లో నమోదై ఉండడంతో నకిలీ రైతులు ఇక కేంద్రాలకు వచ్చే ప్రసక్తే ఉండదు.
జిల్లావ్యాప్తంగా 35 కేంద్రాలు..
జిల్లావ్యాప్తంగా రైతుల నుంచి 50-60 వేల మెట్రిక్ టన్నుల మక్కలను కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించారు. అందుకు తగిన విధంగా 35 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలనుకున్నారు. వాటిలో ఇప్పటివరకు 24 కేంద్రాలు ప్రారంభమయ్యాయి. పీఏసీఎస్, డీసీఎంఎస్ కేంద్రాలు కలిపి ఇప్పటివరకు 12,119 మెట్రిక్ టన్నుల మక్కల సేకరణ పూర్తయింది.
రైతులు పండించిన ప్రతి గింజా కొంటాం..
రైతులు పండించిన ప్రతి మక్క గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఉమ్మడి జిల్లాలో మక్కల కొనుగోలు ప్రక్రియ వేగవంతమైంది. ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతున్నది. కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. సేకరించిన మక్కలను నిల్వ చేసేందుకు గోడౌన్లు సిద్ధంగా ఉన్నాయి. మక్కలు సేకరించిన కొద్దిరోజుల్లోనే మేం రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తున్నాం.
– ఎం.సునీత,మార్క్ఫెడ్ ఉమ్మడి జిల్లా మేనేజర్