సారపాక, డిసెంబర్ 27 : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సారపాక-భద్రాచలం పర్యటనకు సర్వం సిద్ధమైంది. నాలుగురోజులుగా జిల్లా అధికార యంత్రాంగం రాష్ట్రపతి ఏర్పాట్లపై దృష్టి సారించి అందుకు అనుగుణంగా ఏర్పాట్లను పూర్తిచేసింది. రాష్ట్రపతి తొలుత పారిశ్రామిక ప్రాంతమైన సారపాకలోని బీపీఎల్ స్కూల్లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద ల్యాండ్ అవుతారు. అనంతరం కాసేపు ఐటీసీ గెస్ట్హౌస్లో విశ్రాంతి తీసుకొని రోడ్డు మార్గాన సారపాక నుంచి భద్రాచలం పయనమై అక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ పర్యటన నేపథ్యంలో పారిశ్రామికవాడ సారపాకను జిల్లా పోలీసు యంత్రాంగం ఇప్పటికే జల్లెడ పట్టారు. రాష్ట్రపతి పర్యటన ఆధ్యంతం ఈ ప్రాంతమంతా నిఘా నీడలో ఉంటుంది. వీఐపీ, వీవీఐపీలకు కూడా ఆంక్షలు ఉంటాయని భద్రతా బలగాలు చెబుతున్నాయి. రాష్ట్రపతి పర్యటన మొదటి నుంచి చివరి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.
భారీగా మోహరించిన భద్రతా బలగాలు..
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో మంగళవారం ఉదయం నుంచే పెద్దఎత్తున భద్రతా బలగాలు, పోలీసులు మోహరించారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి సారపాక బీపీఎల్ స్కూల్ వద్ద హెలీప్యాడ్లు ఏర్పాటు చేయడంతో నేరుగా ఆమె అక్కడ ల్యాండ్ కానుండడంతో భద్రత విషయంలో కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, జిల్లా ఎస్పీ వినీత్ ఆదేశాల మేరకు భద్రతను కట్టుదిట్టం చేశారు. అడుగడుగునా పోలీసులు మోహరించి ఉండడంతో పారిశ్రామిక ప్రాంతమైన సారపాక నిఘా నీడలో ఉంది.
నేడు విద్యాసంస్థలు బంద్..144వ సెక్షన్ అమలు
రాష్ట్రపతి పర్యటన సందర్భంగా పారిశ్రామిక ప్రాంతమైన సారపాకతోపాటు భద్రాచలంలో కూడా విద్యాసంస్థలు, ఇతర వ్యాపార, వాణిజ్య సంస్థలు బంద్ ప్రకటించాయి. రాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి అవాంతరాలు జరగకుండా ఉండేందుకు ముందుగానే కలెక్టర్ అనుదీప్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు మాత్రం యథావిధిగా ఉంటాయి. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో మంగళవారం సాయంత్రం నుంచే భారీ భద్రతా ఏర్పాటు చేస్తుండడంతోపాటు బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 144వ సెక్షన్ అమలులో ఉంటుంది.
రోడ్డు మార్గాన రాష్ట్రపతి కాన్వాయ్…
సారపాక వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు రాష్ట్రపతి చేరుకున్న అనంతరం ఐటీసీ గెస్ట్హౌస్కు చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి సారపాక నుంచి భద్రాచలం వరకు గోదావరి వంతెనపై సుమారు 4 కిలోమీటర్లు రాష్ట్రపతి కాన్వాయ్ సాగి భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయానికి చేరుకుంటుంది.
కాన్వాయ్ ట్రయల్ రన్..
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, ఎస్పీ వినీత్ ఏర్పాట్లను పరిశీలించారు. తొలుత హెలీప్యాడ్లు, భద్రతా సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం 28కార్లతో కూడిన రాష్ట్రపతి కాన్వాయ్ ట్రయల్ రన్ను కలెక్టర్ ఎస్పీతో కలిసి ప్రారంభించారు. ఈ కాన్వాయ్ సారపాక బీపీఎల్ స్కూల్ నుంచి ప్రారంభమై భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం వరకు సాగింది. తొలుత వారు సారపాక బీపీఎల్ స్కూల్, ఐటీసీలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించి జిల్లాలో పలుశాఖల అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. కాన్వాయ్ భద్రాచలం వెళ్లిన సమయంలో హెలీప్యాడ్ వద్దకు హెలీకాఫ్టర్ మరోమారు ట్రయల్ ల్యాండింగ్ అయింది. ఇక్కడ భద్రతా సిబ్బంది పైలెట్లు పలు సూచనలు చేశారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, డీసీహెచ్ఎస్ రవిబాబు, పలు శాఖల అధికారులు, పోలీసు, ఫారెస్టు, ఎక్సైజ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పకడ్బందీగా ఏర్పాట్లు.. : ఎస్పీ వినీత్
రాష్ట్రపతి బుధవారం పర్యటించనున్న సందర్భంగా ఏర్పాట్లను పకడ్బందీగా చేసినట్లు ఎస్పీ వినీత్ తెలిపారు. మంగళవారం సారపాక వద్ద ఆయన మాట్లాడుతూ సారపాక, భద్రాచలం కలిపి 2వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పర్యటన ఆధ్యంతం భద్రతా విషయంలో ఆంక్షలు ఉంటాయన్నారు. రాష్ట్రపతి పర్యటనకు మూడంచెల భద్రత ఉంటుందని, అధికారులు ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలన్నారు. విధుల్లో ఉండే అధికారులు సైతం ఆర్టీపీఆర్ కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఇప్పటికే సూచించడం జరిగిందన్నారు. సారపాక, భద్రాచలం ప్రాంతాల్లో 28న 144వ సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ప్రజలు అత్యవసర సమయాల్లో 100 నంబర్లో సంప్రదించవచ్చని సూచించారు. 28న ఉదయం నుంచి సాయంత్రం రాకపోకలను సైతం నిలిపివేయడం జరుగుతుందన్నారు. అనంతరం భద్రతా సిబ్బందికి పలు సూచనలు చేసి తొలుత జాగిలాలతో హెలీప్యాడ్లను క్షుణ్ణంగా పరిశీలించారు.