ఇల్లెందు రూరల్, అక్టోబర్ 19: ఉరుకుల పరుగుల జీవితం.. ఉద్యోగ రీత్యా మానసిక ఒత్తిడి.. క్రమం తప్పుతూ ఆహారం తీసుకోవడం.. వ్యాయామం చేయకపోవడం.. ఇలా కారణాలు ఏమైతేనేమి.. ఏటా గుండెపోటుకు గురై చనిపోయే వారి సంఖ్య పెరుగుతూ ఉన్నది. ఈనేపథ్యంలో గుండెపోటు గురించి తెలుసుకోవడం ఎంతో అవసరం. లక్షణాలను ముందే గుర్తిస్తే ప్రమాదం నుంచి సులువుగా బయటపడొచ్చు.
గుండెపోటు లక్షణాలు ఇవీ..
గుండెపోటు అంటే చాలామంది గుండెజబ్బు అనుకుంటారు. అది నిజం కాదు. ఇది రక్తనాళాలు మూసుకోవడం వల్ల వచ్చే ప్రమాదం. రక్త నాళ్లాల్లో కొవ్వు పేరుకుంటే గుండె నుంచి శరీరానికి రక్త సరఫరా నిలిచిపోతుంది. గుండెకు ఆక్సిజన్ అందదు. ఈ పరిణామం గుండెపోటుకు దారితీస్తుంది. సాధారణంగా కొందరు ఛాతి ఎడమ వైపు నొప్పి వస్తే గుండెపోటు అనకుంటారు. కానీ నిజం కాదు. గుండెపోటు వచ్చినప్పుడు కేవలం నొప్పి మాత్రమే వస్తుందనుకుంటారు. కానీ అదీ నిజం కాదు. గుండెపోటు గుండె మీద పొడిచినట్లు ఉండవచ్చు. మంటగా ఉండొచ్చు. ఛాతి బరువుగా ఉండొచ్చు. తీవ్రత కూడా ఎక్కువగా ఉండొచ్చు. తక్కువగా ఉండొచ్చు. చెమటలు ఎక్కువగా పట్టొచ్చు. దవడల్లో నొప్పి రావొచ్చు. భుజాల నొప్పి రావొచ్చు. కానీ అది హార్ట్ఎటాక్ను గుర్తించడం ఎంతో ముఖ్యం. అదెలా అంటే.. జీవితంలో మనమెప్పుడూ అనుభవించని నొప్పి, మంట, హెవీనెస్ మనకు తెలుస్తుంది. ఈ లక్షణాలను గుర్తిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి.
తీసుకునే ఆహారం ఇలా ఉండాలి..
తీసుకునే ఆహారంలో ఎక్కువగా చక్కెర, ఉప్పు, సంతృప్త కొవ్వులు, తరచూ మాంసం తీసుకుంటే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. వేయించిన కూరలు, కూల్డ్రింక్స్, కేక్లు, బరువును పెంచే ఆహార పదార్థాలను పక్కన పెట్టాలి. గోధుమతో చేసిన ఆహార పదార్థాలు, ఓట్స్, చిరుధాన్యాలతో చేసిన ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఇవి శరరంలో కొవ్వును పెంచవు. పీచు పదార్థాలు తీసుకోవచ్చు. రోజుకు కనీసం 40 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. మెడిటేషన్ చేస్తే మరి మంచిది.
చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి..
ధూమపానం, మద్యపానం, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగే ఆహార పదార్థాలు తీసుకోవద్దు. ఒక ఏడాదిలో చలికాలంలోనే ఎక్కువ మంది హార్ట్ ఎటాక్కు గురవుతారు. ఈ కాలంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. గుండెపోటు ఎక్కువగా తెల్లవారుజామునే వస్తుంది. ఛాతిలో నొప్పిగా అనిపించినా, అదే పనిగా చెమటలు పడుతున్నా వెంటనే అప్రమత్తం కావాలి.. వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
– సంధ్యారాణి, ప్రభుత్వ వైద్యురాలు, ఇల్లెందు
గుండెపోటును గుర్తిస్తే..
మీకు గుండెపోటు వచ్చినట్లు గుర్తిస్తే ఉన్నచోటే ఆగిపోవాలి. పెరిగెత్తకూడదు. పక్కన వారిని అప్రమత్తం చేయాలి. ఈలోపు గట్టిగా దగ్గాలి. ఇలా చేస్తే ఊపిరితిత్తులు గుండెను ఒత్తిడికి గురిచేస్తాయి. ఇది ఒక మసాజ్లాగా పనిచేస్తుంది. కొంత ఉపశమనం కలుగుతుంది. ఈలోపు దగ్గర్లోని మెడికల్ షాపు నుంచి ‘సార్బిటరేట్- 5ఎంజీ’ మాత్రలు తెప్పించుకుని నాలిక కింద పెట్టుకోవాలి. దీంతో కాస్త ఉపశమనం లభిస్తుంది. ఆ తర్వాత వెంటనే డాక్టర్ సంప్రదించాలి. సోషల్మీడియాలో ‘ఆస్పిరిన్’ మాత్రనూ వాడొచ్చని వార్తలు వస్తున్నాయి. కానీ ఆ మాత్రలను డాక్టర్లు సిఫార్సు చేస్తేనే వాడాలని గుండె వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇవి చేయకండి..
ఫుడ్ను తీసుకోవడం అత్యంత ప్రమాదకరం. కొందరు రెస్టారెంట్స్, హోటల్ నిర్వాహకులు ఒకసారి వాడిన మంచినూనెను పదే పదే వాడుతుంటారు. ఇలా వేయించిన ఆహార పదార్థాలను తింటే శరీరంలో అవాంఛిత కొవ్వుల నిల్వలు పెరుగుతాయి. రక్త నాళాలు బ్లాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. పొగాకు, మద్యపానానికి పూర్తిగా దూరంగా ఉండాలి.