టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ సన్మాన సభలో ఎమ్మెల్యే సండ్ర
‘మన బడి’తో సర్కారు స్కూళ్లకు జవసత్వాలు: రావుల శ్రీధర్రెడ్డి
కల్లూరు రూరల్/ పెనుబల్లి, జూన్ 25: రాష్ట్రంలో విద్య, వైద్యం సీఎం కేసీఆర్కు రెండు కళ్లని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ప్రజారోగ్యం కోసం పాటుపడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పల్లె, బస్తీ దవాఖానలను ప్రజల వద్దకే తెచ్చిందని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర విద్య, మౌలిక వసతుల సంస్థ (టీఎస్ఈడబ్ల్యూఐడీసీ) చైర్మన్గా ఇటీవల నియమితులైన రావుల శ్రీధర్రెడ్డి పుట్టి, పెరిగి, విద్యాభ్యాసం చేసిన ఊరు.. కల్లూరు మండలంలోని కొర్లగూడెం కావడంతో శనివారం ఆ గ్రామంలో ఆయనకు పౌర సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సన్మాన సభలో ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ.. కొర్లగూడెంలో విద్యాభ్యాసం చేసిన సమయంలో రావుల శ్రీధర్రెడ్డి తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారని గుర్తుచేశారు. ఈ గ్రామంలో పుట్టి పెరిగిన వ్యక్తికి రాష్ట్రస్థాయి చైర్మన్ పదవి రావడం మనందరికీ గర్వకారణమని అన్నారు. అనంతరం గ్రామస్తులతో కలిసి శ్రీధర్రెడ్డిని ఎమ్మెల్యే సత్కరించారు. అనంతరం రావుల శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ.. ‘మన ఊరు – మన బడి’తో సర్కారు బడులకు నూతన జవసత్వాలు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటోంది
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుంటోందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. పెనుబల్లి మండలం కేఎం బంజరు గ్రామంలో శనివారం ఆయన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.