మామిళ్లగూడెం, సెప్టెంబర్ 8: రైతుల పంట రుణాల మాఫీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అధికారులను ఆదేశించారు. రైతుల పంట రుణాల మాఫీ ప్రక్రియపై నూతన కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక జిల్లా స్థాయి సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 3,41,23 మంది రైతుల రుణాలు మాఫీ అవుతాయని అన్నారు. పంట రుణమాఫీ విషయమై సమాచారం రాని రైతులు.. సంబంధిత క్లస్టర్ రైతువేదికలో వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలని సూచించారు.
వ్యవసాయ లక్షకు పైగా రుణం ఉన్న రైతుల రుణాలు కూడా మాఫీ అవుతాయని అన్నారు. ఆర్వోఎఫ్ఆర్ పట్టా రైతులకు కొత్త పంట రుణాలివ్వాలని మంత్రి సూచించారు. ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. వ్యవసాయ, సహకార శాఖలు క్రియాశీలక పాత్ర పోషించాలని, బ్యాంకర్లతో సమన్వయం చేసుకొని ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో పట్టాదారు పాస్ పుస్తకాలు లేక ప్రత్యేక సమస్యలతో రైతులకు పంట రుణమాఫీ అందడం లేదని,
ఈ సమస్యను పరిషరించాలని సూచించారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు మాట్లాడుతూ.. రైతు వేదికల్లో రుణమాఫీ జాబితా ప్రదర్శించాలని సూచించారు. కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. సహకార, బ్యాంకింగ్ శాఖలతో సమన్వయం చేసుకొని ప్రక్రియ పూర్తి చేసేలా పటిష్ట కార్యాచరణ చేస్తామని తెలిపారు. డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, మేయర్ పునుకొల్లు నీరజ, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్, ఎల్డీఎం శ్రీనివాసరెడ్డి, డీఏవో సరిత, డీసీవో విజయకుమారి, డీహెచ్ఎస్వో అనసూయ, బ్యాంకింగ్ కంట్రోలర్లు, బ్యాంకర్లు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.