మణుగూరు టౌన్/ బూర్గంపహాడ్/ దుమ్ముగూడెం/ పర్ణశాల, మే 2: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు మండలాల్లో శనివారం సాయంత్రం ఈదురు గాలులతో వర్షం పడింది. మణుగూరు పట్టణంలో ఈదురు గాలులతోపాటు వడగళ్లతో కూడిన వర్షం పడింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడినా ఈదురు గాలుల ప్రభావంతో కూనారం సమీపంలో మామిడి చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
అశోక్ నగర్లోని టెలిఫోన్ ఎక్సేంజి వెనుక ఉన్న ఇంటిపై పిడుగుపడింది. ఇంటి దిమ్మె కూలిపోవడంతోపాటు ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో గృహోపకరణాలు దగ్ధమయ్యాయి. బూర్గంపహాడ్ మండలంలో ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. దీంతో కల్లాల్లో, మార్కెట్ యార్డుల్లో ఆరబోసిన పంటను కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లు పడ్డారు. సారపాక భాస్కర్నగర్ ఎస్టీ కాలనీలో పెట్టి మధు, హాయ్లాల రత్నం ఇంటి పైకప్పుతో ఉన్న రేకులు ఎగిరిపోవడంతోపాటు ఒక ఇల్లు రేకులతో సహా కూలిపోయింది. గాలిదుమారంతో కురిసిన వర్షంతో నష్టం జరగడంతో బాధితులు నిరాశ్రయులయ్యారు.
దుమ్ముగూడెం మండలం దంతెనం గ్రామంలో గాలిదుమారంతోపాటు రెండు పిడుగులు పడ్డాయి. గ్రామంలోని మేడిబత్తిని చిట్టయ్య ఇంటి వెనుక తాటి చెట్టుపై ఒక్కసారిగా పిడుగు పడింది. అదే గ్రామానికి చెందిన వంద వాసు, వశిష్ట, మహాయుని ఇంటి ఆవరణలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. దీంతో చుట్టుపక్కల ఇళ్లవాసులు భయాందోళనకు గురయ్యారు. గాలిదుమారంతో అక్కడక్కడా చెట్లు కూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అంజుబాక వద్ద నాలుగు విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. రైతులు కోసిన పంటను కాపాడుకునేందుకు నానా పాట్లు పడ్డారు.