కూసుమంచి, ఫిబ్రవరి 2 : నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి వదిలిన నీరు శుక్రవారం ఉదయం పాలేరు రిజర్వాయర్కు చేరుకుంది. ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించే పాలేరు రిజర్వాయర్ డెడ్ స్టోరేజికి చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో బుధవారం సాయంత్రం సాగర్ నుంచి 5,400 క్యూసెక్కుల నీటిని పాలేరుకు వదిలారు. శుక్రవారం ఉదయం పాలేరుకు 600 క్యూసెక్కులు చేరుకోగా శనివారం మధ్యాహ్నం వరకు 3,500 క్యూసెక్కుల వరకు వస్తాయని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. కేవలం తాగునీటికి మాత్రమే నీటిని వాడాలనే కఠినమైన నిబంధన పెట్టారు. దీంతో సాగర్ ఎడమ కాలువ మొదటి నుంచి 135 కిమీ వద్ద గల పాలేరు రిజర్వాయర్ ఇన్ఫ్లో నాయకన్గూడెం వరకు ఉన్న ప్రాంతంలో ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో నీటిని వదులుతున్నారు. పాలేరు ఇన్ఫాల్ను నాయకన్గూడెం వద్ద ఇరిగేషన్ ఈఈ మంగలపుడి వెంకటేశ్వర్లు, డీఈ రమేశ్రెడ్డి పరిశీలించారు.
సాగర్ నుంచి పాలేరు వరకు గల సాగర్ ఎడమ కాలువపై తూములు, షర్టర్లు, మైనర్లు, మేజర్ల వద్ద ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేశారు. ఎక్కడా ట్యాంపరింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సుమారు 10రోజులపాటు 1.50 టీఎంసీల నీటిని పాలేరుకు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఈ నీటిని వేసవి వరకు కేవలం తాగునీటి అవసరాలకు వాడనున్నారు. శుక్రవారం పాలేరు రిజర్వాయర్ నీటిమట్టం 10.5 అడుగులు కాగా సాగర్ జలాలు వస్తుండడంతో వారంరోజుల్లో 20 అడుగుల వరకు చేరనున్నది.
ప్రాజెక్టుల్లో నీటికొరత ఉన్నందున కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని వినియోగించాలని చీఫ్ ఇంజినీర్ విద్యాసాగర్ కోరారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, రైతులు సహకరించాలని పేర్కొన్నారు. ప్రతి నీటిబొట్టు చాలా విలువైనదిగా చూడాలని సూచించారు. కాలువపై ఎక్కడా ట్యాంపరింగ్ జరుగకుండా ఇరిగేషన్ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.