తిరుమలాయపాలెం, ఏప్రిల్ 20 ; ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలుకు చెందిన రైతులు పరికపల్లి వెంకటేశ్వర్లు, బుచ్చిరాములు ఊరచెరువు బావి కింద యేటా నాలుగు ఎకరాల్లో వరి పొలం సాగు చేస్తున్నారు. వానకాలం, యాసంగిలో 34 పుట్ల వడ్లు పండేవి. ఈ ఏడాది యాసంగిలో వరిసాగు చేయగా.. బావిలో నీళ్లు సరిపోలేదు. చెరువులో నీళ్లులేక బావిలో భూగర్భ జలాలు అడుగంటాయి. నీళ్లు సరిపడక రెండు ఎకరాలు పొట్టకొచ్చిన పొలం నిలువునా ఎండిపోయింది. మరో రెండు ఎకరాలు వరుస తడులు తిప్పుతున్నా సగం పంట కూడా చేతికొచ్చే పరిస్థితి లేదు. ఇది వెంకటేశ్వర్లు, బుచ్చిరాములు పరిస్థితే కాదు. టీ.పాలెం మండలంలోని అన్ని గ్రామాల్లో రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. అన్నదాతలు లేకుంటే ప్రతి ఒక్కరూ ‘అన్నమో రామచంద్రా’ అంటూ ఏడవాల్సిందే.. అయితే ఇక్కడ పంటలు పండించేందుకు నీళ్లు లేక రైతులే ‘నీళ్లో రామచంద్రా’ అంటూ మొత్తుకుంటున్నారు.
రెండు పంటలు పండిన మాగాణి పొలాలు నేడు నీళ్లులేక నెర్రెలు బారాయి. పొట్టకొచ్చిన పొలాలు నిలువునా ఎండిపోవడంతో గత్యంతరం లేక పశువులను మేపుతున్నారు. పెట్టిన పెట్టుబడులు సైతం నష్టపోయి అప్పులపాలు కావాల్సి వచ్చిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం తిరుమలాయపాలెం మండలంలో భక్తరామదాసు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించింది. కరువు నేలల్లో కృష్ణా జలాలు పారించి ఈ ప్రాంతాన్ని కోనసీమగా మార్చింది. భక్తరామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా చెరువులు, కుంటలు నింపారు. దీంతో భూగర్భ జలాలు పెరిగి బావులు, బోర్ల కింద కూడా సాగు విస్తీర్ణం పెరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్లీ పాతరోజులొచ్చాయి. ఈ ఏడాది భక్తరామదాసు లిఫ్ట్ ద్వారా చెరువులు, కుంటలు నింపలేదు. దీంతో బావులు, బోర్లలో భూగర్భ జలాలు అడుగంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లనే పంటలు ఎండిపోయి కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నదాతలు అభిప్రాయపడుతున్నారు.
మళ్లీ పాతరోజులొచ్చాయి..
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శ్రీభక్తరామదాసు లిఫ్ట్ ద్వారా చెరువులు నింపారు. బావులు, బోర్లలో పుష్కలంగా నీరుండి వానకాలం, యాసంగిలో వరి సాగు చేశాం. పుష్కలంగా పంట పండింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మళ్లీ పాతరోజులొచ్చాయి. ఈ ఏడాది భక్తరామదాసు లిఫ్ట్ ద్వారా చెరువులు నింపలేదు. దీంతో బావులు, బోర్లలో నీరులేకుండా పోయింది. యాసంగి వరి పొలాలు నిలువునా ఎండిపోయాయి. నేను రెండు ఎకరాలు పొలం సాగు చేసి రూ.60 వేలు పెట్టుబడి పెట్టాను. నీళ్లు లేక పొట్టదశలో పొలం నిలువునా ఎండిపోగా పశువులను మేపాను.
– పరికపల్లి వెంకటేశ్వర్లు, రైతు, పిండిప్రోలు