బాలురకు రెడ్ యాష్ చెక్స్ షర్ట్, బ్రౌన్ కలర్ ప్యాంట్
బాలికలకు రెడ్ యాష్ చెక్స్ టాప్, మెరూన్ కలర్ స్కర్ట్
టిస్కో నుంచి నేరుగా జిల్లా కేంద్రాలకు క్లాత్
ఖమ్మం ఎడ్యుకేషన్, జూలై 3 : రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తున్నది. ఇప్పటికే ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలను ఎంపిక చేసి వాటిని అభివృద్ధి చేసింది. తాజాగా కొత్త యూనిఫాం అందించాలని నిర్ణయించింది. విద్యార్థులు కలర్ఫుల్గా, ఉన్నతంగా కనిపించాలనే ఉద్దేశంతో మన్నిక గల వస్ర్తాలను ఎంపిక చేసింది. ఈ విద్యా సంవత్సరంలో సంస్కరణలతో పాటు కొత్త రంగులతో యూనిఫాం ఇవ్వాలని నిర్ణయించింది. బాలురకు రెడ్ యాష్ చెక్స్ షర్ట్, బ్రౌన్ కలర్ ప్యాంట్, బాలికలకు రెడ్ యాష్ చెక్స్ టాప్, మెరూన్ కలర్ స్కర్ట్, చున్నీ ఇవ్వనున్నది.
రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తున్నది. ఇప్పటికే ‘మన బడి- మన ఊరు’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలను ఎంపిక చేసి వాటిని అభివృద్ధి చేసింది. తాజాగా కొత్త యూనిఫాం అందించాలని నిర్ణయించింది. విద్యార్థులు కలర్ఫుల్గా, ఉన్నతంగా కనిపించాలనే ఉద్దేశంతో మన్నిక గల వస్ర్తాలను ఎంపిక చేసింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులంటే సాధారణంగా వైట్ షర్ట్, బ్లూ ప్యాంట్ గుర్తుకువస్తుంది. దశాబ్దాల పాటు ఇవే రంగులు చూస్తున్నాం. 2020-21లో యూనిఫాం కలర్స్లో మార్పు వచ్చింది. ప్యాంట్ బ్లూ కలర్లోనే ఉంచి టాప్ కలర్ మారింది. చెక్స్ ఉన్న ఆరెంజ్ కలర్ షర్ట్ విద్యార్థులకు అందింది. ఆ తర్వాత కరోనా కారణంగా గతేడాది యూనిఫాం అందలేదు. ఈ విద్యా సంవత్సరంలో సంస్కరణలతో పాటు ప్రభుత్వం కొత్త రంగులతో యూనిఫాం ఇవ్వాలని నిర్ణయించింది. బాలురకు రెడ్ యాష్ చెక్స్ షర్ట్, బ్రౌన్ కలర్ ప్యాంట్, బాలికలకు రెడ్ యాష్ చెక్స్ టాప్, మెరూన్ కలర్ స్కర్ట్, చున్నీ ఇవ్వనున్నది.
ఒక్కో విద్యార్థికి రెండు జతలు..
జిల్లాలోని 21 మండలాల పరిధిలో ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, కేజీబీవీతో పాటు ఇతర విద్యాసంస్థలు కలిపి మొత్తం 1,225 ప్రభుత్వ విద్యాసంస్థలు ఉన్నాయి. 1- 8వ తరగతికి చెందిన ఒక్కో విద్యార్థికి రెండు జతల చొప్పున యూనిఫాం అందనున్నది. 6, 7, 8వ తరగతి బాలికలకు పంజాబీ డ్రెస్, చున్నీ, బాలురకు ప్యాంట్ అందనున్నాయి. బోనకల్లో 43 ప్రభుత్వ స్కూల్స్, చింతకాని 44, ఏన్కూరు 49, కల్లూరు 62, కామేపల్లి 48, ఖమ్మం రూరల్ 62, ఖమ్మం అర్బన్ 90, కొణిజర్ల 54, కూసుమంచి 66, మధిర 56, ముదిగొండ 53, నేలకొండపల్లి 60, పెనుబల్లి 69, రఘునాథపాలెం 60, సత్తుపల్లి 62, సింగరేణి 73, తల్లాడ 48, తిరుమలాయపాలెం 74, వేంసూరు 50, వైరా 48, ఎర్రుపాలెం మండలంలో 54 స్కూల్స్ ఉన్నాయి.
టిస్కో నుంచి నేరుగా..
విద్యార్థులకు అందించే దుస్తుల విషయంలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ టిస్కో (తెలంగాణ స్టేట్ హ్యాండ్ల్యూమ్ వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ) నుంచి తాన్లను కోనుగోలు చేసింది. ఉన్నతాధికారులు ఎన్నో రకాల వస్ర్తాలను పరిశీలించి మన్నిక కలిగిన తాన్లను ఎంపిక చేశారు. తాన్ల లోడ్ టిస్కో నుంచి జిల్లాకేంద్రాలకు, అక్కడి నుంచి మండల కేంద్రాల్లోని ఎమ్మార్సీలకు చేరుకుంటాయి. దర్జీలు అక్కడికి వెళ్లి తాన్లు తీసుకోవాలి. ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థుల దుస్తుల కోసం రూ.2 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తున్నది.
టైలరింగ్కు ఏజెన్సీల ఎంపిక..
విద్యార్థులకు యూనిఫాం సిద్ధం చేసి అందించేందుకు జిల్లాస్థాయిలో ఏజెన్సీల ఎంపిక పూర్తయింది. వీటిలో స్వయం సహాయక బృందాల సభ్యులు, దళిత బందు పథకం కింద టైలరింగ్ యూనిట్లు పొందిన లబ్ధిదారులు, మేరు సంఘం సభ్యులకు అవకాశం ఉంటుంది. అనుమతి పొందిన ఏజెన్సీలు మండల వనరుల కేంద్రాల నుంచి వస్ర్తాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఆయా పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల కొలతలు తీసుకోవాలి. దుస్తుల పంపిణీపై ఇప్పటికే డీఈవో యాదయ్య సమావేశం నిర్వహించారు. వారికి నిబంధనలు, మార్గదర్శకాలను వివరించారు.