వేంసూరు, జనవరి 4 : రాష్ట్రంలో ప్రాథమిక విద్య బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తహసీల్దార్ ఎండీ.ముజాహిద్ అన్నారు. వేంసూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో టీఎల్ఎం (బోధన ఉపకరణాల ప్రదర్శన)మేళాను బుధవారం ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం మన ఊరు – మన బడి అనే కార్యక్రమాన్ని చేపట్టిందని, పాఠశాలల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు చురుగ్గా పనులు సాగుతున్నాయన్నారు.
సబ్జెక్టుల వారీగా ఐదుగురు చొప్పున మొత్తం 20 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసి జిల్లా స్థాయిలో నిర్వహించే పోటీలకు పంపుతామని ఎంఈవో చలంచర్ల వెంకటేశ్వరరావు తెలిపారు. గెలుపొందిన ఆయా పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో వీరేశం, ఎస్సై సురేశ్, సర్పంచ్ ఎండీ.ఫైజుద్దీన్, ఎంపీటీసీ నాయుడు వెంకటేశ్వరరావు, కోఆప్షన్ సభ్యుడు అబ్దుల్ రహీం, కాంప్లెక్స్ హెచ్ఎంలు సుధాకర్ రెడ్డి, కృష్ణకుమారి, కాంతారావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
కామేపల్లి, జనవరి 4 : విద్యార్థుల్లో దాగివున్న సృజన్మాతకతను వెలికి తీసేందుకు టీఎల్ఎం ప్రదర్శన దోహద పడుతుందని ఎంపీపీ బానోత్ సునీత అన్నారు. గోవింద్రాల జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన టీఎల్ఎం ప్రదర్శనను ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులకు కేవలం చదుమే కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉండాలని, సైన్స్ ఆర్ట్స్ క్రాప్స్ విభాగాల్లో వారిలో దాగివున్న ప్రతిభను వెలికి తీసేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా ఉపాధ్యాయులు బోధన చేయాలన్నారు. ప్రతిభ కనబర్చిన ఉపాధ్యాయులకు ప్రశంసా ప్రతాలను అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బానోత్ వెంకటప్రవీణ్కుమార్, సర్పంచ్ రవినాయక్, ఎంపీటీసీ సునీత, హెచ్ఎం రాంబాబు, ఉపాధ్యాయులు నారాయణ, కుమారస్వామి, రామారావు, శ్రీనివాసరావు, శ్యామ్సుందర్, రమేశ్, బన్సీలాల్ తదితరులు పాల్గొన్నారు.
కొణిజర్ల, జనవరి4 : కొణిజర్ల ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించిన టీఎల్ఎం మేళా (టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్) ప్రదర్శన విజయవంతంగా ముగిసింది. వివిధ గ్రామాలకు చెందిన ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు ప్రదర్శించారు. సింగరాయపాలెం ఉన్నత పాఠశాలకు మొదటిస్థానం రాగా, గోపవరం పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు మూడు బహుమతులను గెలుచుకున్నారు. ఈ సందర్భంగా వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు.