గతంలో కిన్నెరసాని వాగు నీరు వృథాగా పోయేది. వాగు ప్రవాహంలో ఎక్కడా అడ్డుకట్ట లేకపోవడంతో నీరంతా గోదావరిలో కలుస్తున్నది. దీంతో ఈ ప్రాంత రైతులు ఏటా వాన కాలంలోనే పంటలు పండించేవారు. యాసంగిలో మెట్ట పంటలు వేసేవారు. లేదంటే పడావుగా వదిలేసేవారు. తెలంగాణ ప్రభుత్వం రెండు పంటలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో చెక్డ్యాంల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా పాల్వంచ మండల పరిధి తవిసలగూడెం, కొత్త సూరారం, పాండురంగాపురం, నాగారం గ్రామాల్లో రూ.40 కోట్లు వెచ్చించి నాలుగు చెక్డ్యాంలు నిర్మించింది. దీంతో 2000 ఎకరాలకు పుష్కలంగా నీరందుతున్నది. అంతేకాదు, చెక్డ్యాంల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరిగాయి. రెండు పంటలకు పుష్కలంగా నీరందుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): కవులకు కావ్య వస్తువైన వాగు కిన్నెరసాని.. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ సైతం వాగు హోయలపై ‘కిన్నెర నడకలు’ రాశారు. ‘కరిగి కిన్నెరసాని వరదలై పారింది.. తరుణి కిన్నెరసాని తరకల్లు కట్టింది..’ అని ఉప్పొంగారు. ‘కిన్నెరసాని వచ్చిందమ్మా.. వెన్నెల పైటేసి..’ అని వర్ణించారు సినీ గేయ రచయిత వేటూరి సుందరరామమూర్తి. అంతటి విఖ్యాతి గాంచింది కిన్నెరసాని.
అయితే.. ఇది కవుల పార్శం మాత్రమే. వాగులోకి కొండ కోనల నుంచి దండిగా నీరు చేరుతుంది. వాగు ప్రవాహంలో ఎక్కడా అడ్డుకట్ట లేకపోవడంతో ఈ నీరంతా వృథాగా గోదావరిలో కలుస్తుంది. దీంతో ఈ ప్రాంతానికి చెందిన రైతులు ఏటా కేవలం వానకాలంలోనే పంటలు పండించేవారు. యాసంగిలో మెట్ట పంటలు పండించేవారు. లేదంటే భూమిని అలాగే వదిలేసేవారు. ఇది పంటల పరంగా మరో పార్శం.
వాగుపై చెక్డ్యాంలు నిర్మించి ఏటా రెండు పంటలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పాల్వంచ మండల పరిధిలోని వాగుపై నాలుగుచోట్ల చెక్డ్యాంలు నిర్మించాలని నిర్ణయించింది. తవిసలగూడెం,కొత్త సూరారం. పాండురంగాపురం, నాగారం పరిధిలోని వాగుపై నాలుగుచోట్ల ఒక్కో నిర్మాణానికి రూ.10 కోట్ల చొప్పున రూ.40 కోట్లతో చెక్డ్యాంలు నిర్మించింది.
2,000 ఎకరాలకుపైగా సాగునీరు..
తవిసలగూడెంలోని కిన్నెరసాని వాగుపై నిర్మించిన చెక్డ్యాం కింద 450 ఎకరాలు, కొత్త సూరారంలో నిర్మించిన చెక్డ్యాం కింద 600 ఎకరాలు, పాండురంగాపురం చెక్డ్యాం కింద 500 ఎకరాలు, నాగారం చెక్డ్యాం కింద 450 ఎకరాలకు పైగా పంటలు సాగు అవుతున్నట్లు అధికారులు అంచనాలు వేశారు. గతంలో ఈ ప్రాంత రైతులు కేవలం వర్షాకాలంలోనే పంటలు సాగు చేసేవారు. రెండో పంటకు నీరు అందేది కాదు. చెక్డ్యాంల నిర్మాణంతో ఇప్పుడు రెండు పంటలకు నీరు అందుతున్నది. కేటీపీఎస్ ద్వారా వచ్చే బూడిద నీటితో కొత్త ఆయకట్టుకు సాగు నీరు అందుతున్నా చెక్డ్యాంలతో పోలిస్తే తక్కువే.
కొన్ని అడుగుల్లోనే భూగర్భజలాలు..
కొత్త సూరారం సమీపంలోని కిన్నెరసాని వాగుపై రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్ల వ్యయంతో చెక్డ్యాం నిర్మించింది. దీంతో వాగులో ఎండాకాలంలోనూ నీరు ఉంటున్నది. చెక్డ్యాంలతో పంటలకు పుష్కలంగా సాగునీరు అందుతున్నది. చెక్డ్యాం ప్రాంతంలో మోటారు బిగించి మేం వరి పైరుకు నీరు పెట్టుకుంటున్నాం. ఈ ప్రాంతంలో కేవలం కొన్ని అడుగుల్లోనే భూగర్భజలాలు అందుబాటులో ఉన్నాయి.
– సున్నం శ్రీను, రైతు, కొత్త సూరారం, పాల్వంచ మండలం
వృథాగా పోయే నీరు పొలాలకు..
చెక్డ్యాంలు నిర్మించకముందే కిన్నెరసాని వాగులో ప్రవహించే నీరంతా వృథాగా గోదావరిలో కలిసేది. చెక్డ్యాం నిర్మించడంతో పంటలకు సాగునీరు అందుతున్నది. ఎండకాలంలోనూ వాగులో నీరు నిలవడంతో పశువులకు నీటి ఎద్దడి తప్పింది.
– తోట నర్సింహారావు, రైతు, సోములగూడెం, పాల్వంచ మండలం
సాగునీరు పుష్కలం..
కిన్నెరసాని వాగుపై సోములగూడెం వద్ద ప్రభుత్వం చెక్డ్యాం నిర్మించింది. దీంతో మా ప్రాంతంలో భూగర్భజలాలు పెరిగాయి. పంటలకు పుష్కలంగా సాగునీరు అందుతున్నది. అలాగే కేటీపీఎస్ బూడిద వాగుతో అందే నీటి కంటే చెక్డ్యాంలతో అందేనీరు ఎక్కువ.
– తేనె రాము, రైతు, సోములగూడెం, పాల్వంచ మండలం