అశ్వాపురం, జూన్ 14: సీతమ్మసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటించడం హర్షణీయమని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. సీతమ్మసాగర్ బహుళ ప్రయోజన ప్రాజెక్టు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని బుధవారం స్థానిక ఎస్కేటీ ఫంక్షన్ హాల్లో నిర్వహించగా.. పెద్ద ఎత్తున ప్రజలు, రైతులు స్వచ్ఛందంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో గోదావరి నదీజలాలను సద్వినియోగం చేసుకుంటూ.. సీతారామ ఎత్తిపోతల పథకానికి అనుసంధానంగా తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సీతమ్మసాగర్ బహుళార్ధక సాధక ప్రాజెక్టును నిర్మిస్తున్నదన్నారు. బ్యారేజీ నిర్మాణం ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు మహబూబాబాద్ జిల్లా కూడా సీతారామ ప్రాజెక్టు ద్వారా సస్యశ్యామలం అవుతుందన్నారు.
జలవిద్యుత్ ఉత్పాదకతకు కూడా సీతమ్మసాగర్ ప్రాజెక్టు దోహదం చేస్తుందన్నారు. సాగునీటి రంగం అభివృద్ధిపైనే తెలంగాణ పునర్నిర్మాణం ఆధారపడి ఉన్నదని, దీనిని గ్రహించిన ప్రభుత్వం వ్యవసాయరంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు ప్రాజెక్టులు నిర్మిస్తున్నదన్నారు. ఇలాంటి బృహత్తర ప్రాజెక్టు నిర్మాణానికి మద్దతుగా నిలిచిన ప్రజలు, రైతులకు ప్రభుత్వం తరఫున రేగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, జలవనరుల శాఖ సీఈ శ్రీనివాసరెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ రవీందర్, జడ్పీటీసీ సూదిరెడ్డి సులక్షణ, వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం, జలవనరుల శాఖ ఎస్ఈ వెంకటేశ్వరరెడ్డి, ఈఈ శ్రీనివాసరెడ్డి, డీఈలు రాంబాబు, శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్, నాయకులు కందుల కృష్ణార్జునరావు, వెన్న అశోక్కుమార్, ఈదర సత్యనారాయణ, సర్పంచ్ మర్రి మల్లారెడ్డి, చిలకా వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు.