సారపాక, మే 15: క్రీడలకు పెద్దపీట వేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. గ్రామీణ యువకుల్లో నైపుణ్యాలను గుర్తించేందుకు కీడ్రాపోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మణుగూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీఎం కప్ క్రీడాపోటీలను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తోందని అన్నారు. అన్ని రకాల క్రీడలకు అనుకూలంగా ఉండేలా ప్రతి పల్లెల్లోనూ కోట్లాది రూపాయలతో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీసేలా సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న కృషి మరువలేనిదని అన్నారు.
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం క్రీడారంగానికి అధిక ప్రాధాన్యమిస్తోందని అన్నారు. క్రీడాకారులు కూడా మరింతగా రాణించాలని కోరారు. క్రీడాకారులు ఆయా క్రీడల్లో రాష్ర్టానికి, దేశానికి మంచిపేరు తేవాలన్నదే కేసీఆర్ ఆకాంక్ష అని అన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికే కాకుండా శారీరక దారుఢ్యానికీ దోహదం చేస్తాయని అన్నారు. ఈ నెల 17 వరకు సీఎం కప్ క్రీడలు కొనసాగుతాయని అన్నారు. అనంతరం ఆయన వాలీబాల్ సర్వీస్ చేసి కొద్దిసేపు క్రీడాకారులతో కలిసి ఆడారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పోశం నర్సింహారావు, ఎంపీపీ కారం విజయకుమారి, ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.