సీఈకూసుమంచి, అక్టోబర్ 29: పాలేరు ఆయకట్టు కింద వేసిన పంటలను కాపాడేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ నెల 6న తీసుకున్న నిర్ణయంతో రిజర్వాయర్కు బయ్యన్న వాగు ద్వారా కృష్ణా జలాలు మళ్లించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈ నెల 13 నుంచి నాలుగు రోజులపాటు గోదావరి జలాలు పాలేరుకు మళ్లించి సాగర్ ఆయకట్టుకు విడుదల చేశారు. మళ్లీ వర్షాభావ పరిస్థితులు కన్పిస్తుండడం, ఎండలు వేసవిని తలపిస్తుండడంతో వరి పొలాలకు నీరు కావాలని రైతులు కోరుతున్నారు. దీంతో పాలేరు కింద వానకాలం వేసిన పంటలు కాపాడేందుకు శనివారం బయ్యారం రిజర్వాయర్ నింపి దాని నుంచి సుమారు 72 కిలోమీటర్ల గ్రావిటీ ద్వారా బయ్యన్నవాగు నుంచి గోదావరి జలాలను పాలేరు వాగుకు వదులుతున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా మోతె మండలం నర్సింహాపురం వద్ద పాలేరు వాగులో గోదావరి జలాలు కలుస్తుండడంతో ఆ నీటి ప్రవాహాన్ని చీఫ్ ఇంజినీర్ విద్యాసాగర్, ఈఈ మంగలపుడి వెంకటేశ్వర్లు, ఇతర ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. బయ్యన్నవాగు ద్వారా 1,600 క్యూసెక్కుల నీరు దిగువకు వస్తుండగా అందులో నుంచి 1,200 క్యూసెక్కుల నీరు పాలేరు రిజర్వాయర్లోకి చేరుతోంది. శనివారం సాయంత్రానికి పాలేరు నీటిమట్టం 18 అడుగులు ఉండగా.. సోమవారం నాటికి 22 అడుగులకు చేరుకునే అవకాశం ఉంది. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ.. బయ్యన్నవాగు ద్వారా గోదావరి జలాలు వస్తున్నందున ఆ ప్రాంతంలోని పశువుల, మేకల కాపరులు, రైతులు జాగ్రత్తగా ఉండాలని, ప్రవాహం ఎక్కువగా ఉన్నందున వాగు దాటవద్దని సూచించారు. కాగా, సాగర్ కింద మొదటి జోన్లో కల్లూరు వరకు గల ఆయకట్టు కింద పంటలు కాపాడేందుకు అధికారులు పాలేరు రిజర్వాయర్ నుంచి ఒకటి రెండు రోజుల్లో నీటిని విడుదల చేయనున్నారు.