భద్రాచలం, జనవరి 14 : గత నెల 17వ తేదీ నుంచి భద్రాచలం దివ్యక్షేత్రంలో ప్రారంభమైన ధనుర్మాసోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. సంక్రాంతి పండుగ ముందు రోజు భోగి పండుగనాడే గోదారంగనాథుల కల్యాణం నిర్వహించడం ఆచారంగా వస్తోంది. ఈ క్రమంలోనే ఉదయం గోదారంగనాథులను బేడా మండపంలో వేంచేపు చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఆండాళ్ అమ్మవారు అనుగ్రహించిన తిరుప్పావైలోని 30వ పాశురాన్ని ఆలపించారు. ఆండాళ్ అమ్మవారు తాను చేసిన ధనుర్మాస వ్రతం కారణంగా శ్రీకృష్ణ పరమాత్మను పొందింది. శ్రీరంగనాథుడు ఆమెనే స్వయంగా వరించి పాణిగ్రహణం చేశాడు. ముందుగా విశ్వక్సేన ఆరాధన, కర్మణ ఫుణ్యాహవాచన చేసి అమ్మవారికి, స్వామివారికి కంకణధారణ చేశారు.
తర్వాత అమ్మవారికి యోక్త్రధారణ, అయ్యవారికి యజ్ఞోపవీతధారణ, కంకణధారణ చేశారు. ఆ తదుపరి స్వామివారి, అమ్మవారి వంశప్రవరను భక్తులకు, భక్తుల గోత్రనామాలను స్వామివారికి విన్నవించారు. అనంతరం గోదారంగనాథుల వార్షిక కల్యాణాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. గోదారంగనాథుల కల్యాణం సందర్భంగా అర్చకులు సంప్రదాయబద్ధంగా నృత్యం చేశారు. సంక్రాంతి సెలవులు కావడంతో రామాలయానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తారు. అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయడంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగలేదు.
పర్ణశాలలో…
పర్ణశాల, జనవరి 14: ధనుర్మాస వ్రత మహోత్సవం సందర్భంగా పర్ణశాల అనుబంధ ఆలయమైన రామాలయంలో ఆదివారం అర్చకులు శ్రీగోదా రంగనాయకస్వామి కల్యాణం నిర్వహించారు. మంగళాష్టకాలు మహా సంకల్పం, జీలకర్ర బెల్లం మాంగళ్యం, పూజధారణ చేపట్టారు. ఏర్పాట్లను ఏఈవో శ్రవణ్కుమార్, సూపరింటెండెంట్ కత్తి శ్రీనివాస్ పర్యవేక్షించారు.
చర్లలో…
చర్ల, జనవరి 14: ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని మండల కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి ఆలయం, పాత చర్లలోని సీతారామ లక్ష్మణ భక్తాంజనేయస్వామి ఆలయం, దుమ్ముగూడెంలోని ఆత్మారామ చంద్రస్వామి ఆలయంలో ఆదివారం అర్చకులు గోదా రంగనాథస్వా మి కల్యాణ మహోత్సవం నిర్వహించారు. వేడుకకు అధి క సంఖ్యలో భక్తులు విచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు.