పాల్వంచ రూరల్, మార్చి 19 : పండ్ల మొక్కలతోపాటు ప్రజలకు ఉపయోగపడే మొక్కలను నర్సరీల్లో పెంచడానికి ప్రాధాన్యం ఇవ్వాలని అదనపు కలెక్టర్, డీఆర్డీవో విద్యాచందన అధికారులకు సూచించారు. లక్ష్మీదేవిపల్లి, బసవతారక కాలనీ, జగన్నాథపురం, కేశవాపురం పంచాయతీల్లోని నర్సరీలను ఆమె మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా జగన్నాథపురం నర్సరీ వద్ద అధికారులతో మాట్లాడుతూ ప్రస్తుత వేసవిలో నర్సరీల్లో మొక్కలు ఎండిపోకుండా నిరంతరం నీరు అందించాలన్నారు. మొక్కలు ఎండిపోయిన బ్యాగుల్లో మళ్లీ కొత్త మొక్కలకు సంబంధించిన గింజలు వేయాలన్నారు. మొక్కల సముదాయం ముందు ఆయా మొక్కల పేర్లు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. నర్సరీల్లో నూరు శాతం పచ్చదనం ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆమె వెంట ఎంపీడీవో విజయభాస్కర్రెడ్డి, ఏపీవో పోరండ్ల రంగా, పంచాయతీ కార్యదర్శులు కృష్ణవేణి, రాంబాబు, సాయిరాం, క్షేత్రస్థాయి సిబ్బంది నాగేశ్వరరావు, శంకర్ పాల్గొన్నారు.