ఖమ్మం ఎడ్యుకేషన్, సెప్టెంబర్ 15: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మం జిల్లాలో పేపర్-1కు 54 పరీక్ష కేంద్రాలు, పేపర్-2కు 45 కేంద్రాల్లో పరీక్ష జరిగింది. పేపర్-1కు 12,923 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 2,458 మంది గైర్హాజరయ్యారు. హాజరు 80.98శాతం నమోదైంది. పేపర్-2కు 10,480 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 952 మంది గైర్హాజరయ్యారు. హాజరు 90.92శాతం నమోదైంది.
ఖమ్మంలోని పరీక్షా కేంద్రాలను కలెక్టర్ వీపీ గౌతమ్ పరిశీలించారు. అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ మూడు కేంద్రాలు, టెట్ జిల్లా అబ్జర్వర్ సామినేని సత్యనారాయణ మూడు కేంద్రాలు, డీఈవో సోమశేఖరశర్మ 11 కేంద్రాలను తనిఖీ చేశారు. ప్రశ్నాపత్రాలు, సమాధాన పత్రాల తరలింపుపై పోలీస్శాఖ ప్రత్యేక శ్రద్ధ వహించింది. పరీక్ష నిర్వహణలో రెవెన్యూ, మెడికల్, ఆర్టీసీతోపాటు ఇతర ప్రభుత్వశాఖ అధికారులు భాగస్వాములయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలైంది. ‘నిమిషం ఆలస్యం’ నిబంధన అమలులో ఉండడంతో వివిధ ప్రాంతాల నుంచి గంట ముందుగానే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. అభ్యర్థులతో బస్టాండ్లు, ప్రధాన కూడళ్లు కిటకిటలాడుతూ కనిపించాయి.
భద్రాద్రి జిల్లాలో..
కొత్తగూడెం ఎడ్యుకేషన్, సెప్టెంబరు 15: భద్రాద్రి జిల్లాలో మొదటి పేపర్కు 37 కేంద్రాలు, రెండవ పేపర్కు 29 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. మొదటి పేపర్కు 8,717 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 1,410 మంది గైర్హాజరయ్యారు. రెండో పేపర్కు 6,661 మంది అభ్యర్థులు హాజరుకాగా 530 మంది గైర్హాజరయ్యారు. భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల లక్ష్మీదేవిపల్లిలోని కృష్ణవేణి జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.