రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో జూదం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి ఏరియా పేకాట, కోడిపందేలు, క్రికెట్ బెట్టింగ్లకు అడ్డాగా మారింది. అదుపు చేయాల్సిన పోలీసులు నిద్రమత్తులో జోగుతుండడంతో జూదరులు రెచ్చిపోతున్నారు. పోలీసుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయంటూ నిర్వాహకులు ప్రచారం చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కృష్ణాజిల్లా ఒకపక్క, పశ్చిమగోదావరి జిల్లాలు మరోపక్క సరిహద్దులుగా ఉండడంతో సత్తుపల్లి ప్రాంతం జూదం నిర్వాహకులకు అనుకూలంగా మారింది. సత్తుపల్లి, వేంసూరు మండలాల్లో యథేచ్ఛగా పేకాట, కోడిపందేలు నిర్వహిస్తూ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారని ప్రజలు బహిరంగంగానే చెబుతున్నారు.
గతంలో జనవరి వచ్చిందంటే సత్తుపల్లి ప్రాంతంలో పేకాట, కోడిపందేల హడావుడి కనిపించేది. ప్రస్తుతం సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లోని సరిహద్దుల్లో ఏదో ఒక ప్రదేశంలోని మామిడి తోటల్లో నిత్యం మూడు ముక్కలాట సాగుతోంది. ఈ ఆటనే కొన్ని ప్రాంతాల్లో ‘అందర్ బహార్’, కోస్ ఆటగా పిలుస్తారు. పేకాటలోనే అత్యంత ప్రమాదకరమైన ఈ ఆట యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. ఈ ఆటకు అలవాటు పడినవారు ఆస్తులు అమ్ముకొని అప్పుల పాలవుతున్నారు. జూదానికి అలవాటుపడిన జూదరులు సంక్రాంతి మాసంలో వచ్చిన పంటను అమ్మగా వచ్చిన నగదును జూదంలో పెట్టుబడి పెట్టి నష్టపోతున్నారు. ఏడాది మొత్తం కష్టపడి సంపాదించిన సొమ్ము మొత్తం ఒకటి, రెండు రోజుల్లో జూదంలో పోగొట్టుకునే సరికి అనేకమంది అప్పుల పాలై జీవితాలను పాడుచేసుకున్న సంఘటనలూ సత్తుపల్లి ప్రాంతంలో కోకొల్లల కుటుంబాలు ఉన్నాయి. ఇంత తంతు జరుగుతున్నా జూదంను అరికట్టాల్సిన పోలీసు శాఖ అడపాదడపా దాడులు నిర్వహిస్తున్నప్పటికీ పోలీసుల కళ్లుగప్పి మరీ తమ తతంగం మొత్తం జూదం నిర్వాహకులు కొనసాగిస్తుండడం పలు ఆరోపణలకు తావిస్తోంది.
రాజకీయ అండదండలతో తాము పోలీసుల నుంచి అనుమతి తీసుకుని మరీ జూదం నిర్వహిస్తున్నామని, వివిధ ప్రాంతాల్లో ఉన్న జూదరులకు నిర్వాహకులు ఫోన్ చేసి మరీ రప్పించి పేకాట నిర్వహిస్తున్నారనేది బహిరంగ రహస్యం. దీనికి తోడు ఫ్లడ్ లైట్లు, భారీ టెంట్లు ఏర్పాటు చేసి వచ్చిన వారికి ఖరీదైన మందు, పసందైన విందులను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా సత్తుపల్లి పట్టణానికి చెందిన కొందరు ప్రముఖులు ఈ ఏర్పాట్లు చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, తమకు తిరుగులేదని, ఎమ్మెల్యే మా సొంత మనిషి అని ప్రచారం చేసుకుంటూ జూదగాళ్లను నమ్మించి మరీ తాము నిర్వహించే జూదానికి పిలిపిస్తున్నారు. వచ్చిన ఒక్కొక్కరి నుంచి వేలాది రూపాయలు ప్రవేశ రుసుము వసూలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. భారీ మొత్తంలో వసూలు చేసిన ప్రవేశ రుసుము నగదు తాము మామూళ్ల రూపంలో అధికారులు, ప్రజాప్రతినిధులకు ముట్టజెప్పాలని జూదరులకు చెబుతూ తమ పని తాము కానిచ్చుకుంటున్నారని తెలుస్తోంది. సత్తుపల్లి ప్రాంతంలో జరిగే జూదానికి సంబంధించి ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తుమ్మల నాగేశ్వరరావు సత్తుపల్లి పోలీసు అధికారులను తక్షణమే జూదం అరికట్టాలని హెచ్చరించినట్లు కూడా సమాచారం. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆది, సోమవారాల్లో కూడా సత్తుపల్లి ప్రాంతంలో పెద్దఎత్తున జూదం శిబిరాలు నిర్వహించిన విషయం సదరు మంత్రికి తెలిసి నిర్వాహకులను మందలించడంతో జూదాన్ని నిలిపివేసినట్లు తెలిసింది.
కల్లూరు సబ్ డివిజన్లో ఎక్కడ జూదం జరిగినా తన సెల్ నెంబర్ 8712659166కు కానీ, సంబంధిత మండలాల్లోని పోలీస్స్టేషన్కు లేదా 100కు తక్షణమే సమాచారం ఇవ్వాలని కల్లూరు ఏసీపీ రామానుజం చెప్పారు. పర్మిషన్ ఉందంటూ చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ప్రధానంగా సత్తుపల్లి నియోజకవర్గం ఆంధ్రా సరిహద్దులో ఉండడం వల్ల అక్కడక్కడా సమాచారం వస్తుందని, తమ సిబ్బంది వెళ్లి పరిశీలిస్తే అలాంటి సంఘటన ఏమీ సబ్ డివిజన్ పరిధిలో జరగనట్లు తెలిసిందన్నారు. ఏదేమైనా జూదానికి ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తప్పవన్నారు. సరిహద్దు జిల్లాల పోలీసు అధికారులతో కూడా సమన్వయపర్చుకుని జూదం జరగకుండా చర్యలు చేపడతామన్నారు.