అవయవ లోపం ఉన్నదని బాధపడొద్దు. ఎవరి ఆసరా లేకుండా ఆరోగ్యంగా ఎదగాలని.. తోటి పిల్లలతో చదువుతోపాటు ఆటపాటల్లో మునిగి తేలాలని, తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు వైకల్యంతో ఉన్నట్లు కుంగిపోవద్దనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసి భరోసా కల్పిస్తున్నది. అంధులు, శారీరక, మానసిక దివ్యాంగులు, బధిరులు, ఆటిజం, పాక్షిక దృష్టి లోపం, ఇతర వైకల్యాలతో బాధపడే పిల్లల కోసం ఐఆర్సీ, నాన్ ఐఆర్సీ కేంద్రాలు ఏర్పాటు చేసి శారీరక మార్పులు, ఎదుగుదల కోసం కృషి చేస్తున్నది. జిల్లావ్యాప్తంగా 21 కేంద్రాల్లో 278 మంది విద్యార్థులకు ప్రత్యేక సేవలు అందిస్తున్నది.
ఖమ్మం, జూన్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వివిధ వైకల్యాలతో బాధపడుతున్న చిన్నారులను సామాజికంగా, విద్యాపరంగా తీర్చిదిద్దేందుకు భవిత కేంద్రాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో ఈ కేంద్రాలు పనిచేస్తున్నాయి. కేంద్రాల ద్వారా జిల్లావ్యాప్తంగా శారీరక, మానసిక వైకల్యం కలిగిన 18 ఏళ్లలోపు 278 మంది బాలలకు సేవలు అందుతున్నాయి.
21 కేంద్రాల ద్వారా సేవలు..
దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నది. అంధులు, శారీరక, మానసిక దివ్యాంగులు, బధిరులు, ఆటిజం, పాక్షిక దృష్టి లోపంతోపాటు ఇతర వైకల్యాలతో బాధపడే పిల్లల కోసం ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా 21 మండలాల్లో విలీన కేంద్రాలు (ఐఆర్సీ), నాన్ ఐఆర్సీ కేంద్రాలు ఏర్పాటు చేసింది. వీటిలో 40 మంది స్పెషల్ టీచర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో 11 మంది ఫిజియోథెరపిస్టులు. ఒక్కో ఫిజియోథెరపిస్టు రెండు నుంచి మూడు మండలాల పరిధిలోని విలీన కేంద్రాలు, నాన్ ఐఆర్సీ కేంద్రాలకు వెళ్లి పిల్లలకు ఫిజియోథెరపీ చేస్తున్నారు.
ఏడాదికి రూ.3,500 రవాణా భత్యం..
భవిత కేంద్రాలకు వచ్చే విద్యార్థులకు ప్రభుత్వం ఏడాదికి రూ.3,500 చొప్పున ఎస్కార్ట్ రవాణా భత్యం అందిస్తున్నది. జిల్లావ్యాప్తంగా 200 మందికి పైగా భత్యం అందుతున్నది. సదరం సర్టిఫికెట్స్ ఆధారంగా కొందరికి బస్పాస్లు, రైల్వే పాస్లూ అందుతున్నాయి.
కేంద్రాల ద్వారా ప్రయోజనం…
భవిత కేంద్రాలు నిత్యం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు తెరిచి ఉంటాయి. ఒక్కో కేంద్రంలో ఇద్దరు స్పెషల్ టీచర్లు విధులు నిర్వహిస్తారు. వీరు వైకల్య విద్యార్థులకు నిత్య అలవాట్లపై అవగాహన కల్పిస్తారు. ప్రాథమిక స్థాయి విద్య అందిస్తారు. సిబ్బంది వారంలో ఒకరోజు పిల్లలకు ఫిజియోథెరపీ చేస్తారు. తద్వారా పిల్లల శరీరంలో కదలికలు తీసుకువస్తున్నారు. మాటలు రానివారికి స్పీచ్ థెరపి అందిస్తున్నారు. అంధులకు బ్రెయిలీ లిపిలో పాఠాలు బోధిస్తున్నారు. కేంద్రాలు లేని చోట ప్రాథమిక పాఠశాలల్లోని తరగతి గదుల్లో పిల్లలకు ఫిజియోథెరపీ చేస్తున్నారు. మిగిలిన రోజుల్లో శిక్షకులు ప్రాథమిక విద్యను బోధిస్తున్నారు. విద్యార్థులకు కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. బెంగుళూరు, ఢిల్లీకి చెందిన వైద్యులు ఏటా ఒకసారి పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారి సూచనల మేరకు పిల్లలకు అవసరమైన పరికరాలను ఉచితంగా అందిస్తున్నాం.
ఎనిమిది కేంద్రాలు సొంత భవనాల్లో..
వైకల్య బాధితుల కోసం ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 21 భవిత కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ఎనిమిది కేంద్రాలు సొంత భవనాల్లో కొనసాగుతున్నాయి. సొంత భవనాల్లో కొనసాగే కేంద్రాలను ఐఆర్సీ కేంద్రాలు అని, పాఠశాల కాంప్లెక్స్లో నిర్వహించే కేంద్రాలను నాన్ ఐఆర్సీ కేంద్రాలు అని అంటారు. ప్రస్తుతం కామేపల్లి, ఖమ్మం రూరల్, కూసుమంచి, కొణిజర్ల, ఏన్కూరు, సత్తుపల్లి, పెనుబల్లి, మధిర కేంద్రాల్లో భవిత ఐఆర్సీ కేంద్రాలు ఉన్నాయి.
మిగిలిన విద్యార్థులతో కలిసేలా శిక్షణ..
వైకల్య విద్యార్థుల సమస్యలకు అనుగుణంగా లివింగ్ స్కిల్స్ నేర్పిస్తాం. వారికి ప్రైమరీ విద్య బోధిస్తాం. వారిలోని లోపాలను సవరించి మిగిలిన విద్యార్థులతో కలిసిపోయేలా చేస్తాం. స్పీచ్ థెరపి, ఫిజియోథెరపీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం. వారి కోసం ప్రభుత్వం స్పెషల్ బుక్స్, దుస్తులు సైతం అందిస్తున్నది.
– కొప్పుల పిచ్చయ్య, భవిత కేంద్రం స్పెషల్ టీచర్
పిల్లల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాం…
వైకల్య బాధిత చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపేలా భవిత కేంద్రాలు పనిచేస్తున్నాయి. ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు విలీన కేంద్రాల్లో అందిస్తున్న సేవలతో పిల్లలు తల్లిదండ్రులపై ఆధారపడకుండా బతకగలుగుతారు. కేంద్రాల పరిధిలోని సేవలను వినియోగించుకునేందుకు పిల్లల తల్లిదండ్రులు ముందుకురావాలి. పిల్లలకు వైద్య పరీక్షలు చేయించి వారికి అవసరమైన పరికరాలను ఉచితంగా అందిస్తాం.
– ఇ.సోమశేఖర శర్మ, డీఈవో