మారుతున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు
మన ఊరు/బస్తీ – మన బడిలో బాగుపడుతున్న స్కూళ్లు
మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం
పాఠశాల కమిటీల ద్వారా ఇంజినీర్ల పర్యవేక్షణలో పనులు
పాల్వంచలో మొదటి విడత 24 పాఠశాలలు ఎంపిక
పాల్వంచ, మే 14: సర్కార్ బడులు సరికొత్తగా మారుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘మన ఊరు/ బస్తీ- మన బడి’ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలే మారిపోతున్నాయి. పాఠశాలలను బలోపేతం చేసి ప్రైవేట్కు దీటుగా విద్యాబోధన చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతున్నది. అన్ని పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తున్నది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియంలో బోధన చేపట్టేందుకు పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే ఉపాధ్యాయులందరికీ విడతల వారీగా ప్రత్యేక శిక్షణను ఇచ్చి బోధనకు సిద్ధం చేసింది. ఆయా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ఇంజినీర్లు అంచనాలు తయారుచేసి పనులు ప్రారంభించేందుకు ప్రణాళికలను రూపొందించారు. పాల్వంచ అర్బన్లో 16, మండలంలో 8 పాఠశాలలను ఎంపిక చేశారు. అర్బన్లో పాత పాల్వంచ, కొమ్ముగూడెం, బొల్లోరుగూడెం, కరకవాగు, హైస్కూళ్లతోపాటు కేటీపీఎస్ కాలనీలోని అభ్యుదయ బాలికల పాఠశాల, అలాగే పాత పాల్వంచ, కొమ్ముగూడెం, బొల్లోరు గూడెం, ఇందిరాకాలనీ, పాలకొయ్యతండా, కరకవాగు, ప్రశాంత్నగర్, కేటీపీఎస్ ఏ కాలనీ ప్రాథమిక పాఠశాలలు, వికలాంగులకాలనీ, శ్రీనివాసకాలనీ, ఎర్రగుంట ప్రాథమికోన్నత పాఠశాలలను ఎంపిక చేశారు.
మండలంలోని యానంబైలు ప్రాథమిక, ఉన్నత, పాండు రంగాపురం, జగన్నాథపురం, నాగారాం ప్రాథమిక, తోగ్గూడెం, పునుకుల ప్రాథమి కోన్నత, నాగారం ఉన్నత పాఠశాలలను ఎంపిక చేశారు. పాఠశాలలకు వేసవి సెలవులు ఇచ్చే లోపే ఆయా పాఠశాలలకు సంబంధించిన విద్యా కమిటీ, గ్రామస్తులు, సర్పంచులు, వివిధ ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి పాఠశాలలో చేయాల్సిన పనులపై తీర్మానాలను చేసి బ్యాంకు అకౌంట్ల ప్రక్రియ పూర్తి చేశారు. వేసవి సెలవుల అనంతరం కూడా పాఠశాలల్లో చేయాల్సిన పనులకు సంబంధించిన ప్రతిపాదనలను ఇంజినీర్లు పూర్తి చేసి పనులు మొదలుపెట్టారు. పనుల పురోగతిపై కలెక్టర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ విద్యాశాఖ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. జూలై మొదటివారం కల్లా పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు ప్రణాళికాబద్దంగా పనులు చేపడుతున్నారు.
బాలుర, బాలికల పాఠశాలలకు మోక్షం
పట్టణంలో పేద బాలికలకు అనువైన పాఠశాలగా పేరొందిన కేటీపీఎస్ ఏ కాలనీ ప్రాంగణంలోని అభ్యుదయ బాలికల పాఠశాల, ప్రాథమిక బాలుర పాఠశాలలకు మన ఊరు – మన బస్తీ కార్యక్రమం ద్వారా చాలా మేలు కలగనున్నది. 554 మంది బాలికలు ఉన్న అభ్యుదయ బాలికల ఉన్నత పాఠశాల, 347మంది విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలలకు లాభం చేకూరనున్నది. గతంలో వర్షపు నీరు తరగతి గదుల్లోకి సైతం చేరి పాఠాలు చెప్పలేని పరిస్థితి ఉండేది. దీన్ని దృష్టిలో పెట్టుకుని నాలుగేళ్ల క్రితం టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరు గదుల నిర్మాణాన్ని పూర్తి చేసింది. మిగిలిన ఎనిమిది గదులకు ప్రస్తుతం మోక్షం కలిగింది. దీంతోపాటుగా పక్కనే ఉన్న ప్రాథమిక పాఠశాలలో రేకుల షెడ్లల్లోనే వర్షానికి తడుస్తూ విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ పాఠశాలను కూడా ఈ కార్యక్రమం కింద ఎంపిక చేయడంతో పాఠశాల గదుల నిర్మాణంతోపాటు పాడైపోయిన రేకుల తొలగింపు, పాడైన తలుపులు, కిటికీల మరమ్మతులు పూర్తి చేయడం అలాగే పాడైపోయిన మరుగుదొడ్లకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయనున్నారు. రంగులు లేక కళావిహీనంగా ఉన్న పాఠశాల గదులకు రంగులు వేసి సుందరంగా తీర్చిదిద్దనున్నారు. విద్యార్థులను ఆకట్టుకునే విధంగా బొమ్మలు వేసి ఆకర్షణీయంగా మార్చనున్నారు. ప్రైవేట్ పాఠశాలల కంటే దీటుగా విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. పూర్తిస్థాయిలో ఈ రెండు పాఠశాలలను బాగు చేస్తే పట్టణంలో పేద విద్యార్థులు దాదాపు ఈ పాఠశాలలో చేరనున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్న విద్యార్థులు
కొవిడ్-19 ప్రభావం వల్ల ఇప్పటికే ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 2021-22 విద్యా సంవత్సరంలో చాలామంది చేరారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంతోపాటు ‘మన ఊరు -మన బడి’ కింద పాఠశాలలను బాగు చేస్తుండడంతో ఈ విద్యా సంవత్సరం అత్యధిక సంఖ్యలో అడ్మీషన్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలు
మన ఊరు -మన బడి పాఠశాలల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం. తాగునీరు, మరుగుదొడ్లు, పాఠశాల భవనాల మరమ్మతులు, కొత్త భవనాల ఏర్పాటు తదితర అన్నింటిపై ప్రతిపాదనలు తయారు చేసి పనులు చేపడుతు న్నాం. అన్ని పాఠశాలలను ఇంజినీరింగ్ అధికారులు సందర్శించి పాఠశాల హెచ్ఎస్ఎంసీ, గ్రామస్తులు, సర్పంచులతో సమావేశమై పాఠశాలలకు అవసరమైన వాటిని తీర్మానించి పనులు చేస్తున్నారు. మరో రెండు నెలల్లో అన్ని పనులు పూర్తి కానున్నాయి.
– ఎ. శ్రీరామ్మూర్తి, పాల్వంచ ఎంఈవో