సారపాక, డిసెంబర్ 8 : అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసం నుంచి అయ్యప్ప మాలధారుల కోలాహలం కనిపిస్తున్నది. సంక్రాంతి పండుగ వరకు ఎంతో పవిత్రత.. నిష్టలతో41 రోజులపాటు కఠిన నియమాలతో మాలధారులు దీక్ష చేపడతారు. నిత్యం పూజలతోపాటు సాయంత్రం భజనలు చేస్తూ స్వామివారిని తలుస్తుంటారు. మాల పూర్తయ్యే సమయానికి స్వాములు ఇరుముడి ధరించి శబరిమలైకు వెళ్లి అయ్యప్పస్వామిని దర్శించుకుంటారు. స్వామి దర్శనానికి ముందు 18 మెట్లు ఎక్కాలి.. ఈ మెట్లను అధిరోహించడం ద్వారా అవిద్య, అజ్ఞానం తొలగిపోయి స్వామి అనుగ్రహం లభిస్తుందని దీక్షాదారుల నమ్మకం. ఆధ్యాత్మిక, ఆరోగ్య సూత్రాల మేళవింపు.. అయ్యప్ప దీక్ష మనస్సు, శరీరాన్ని పవిత్రం చేసుకుని ఆధ్యాత్మిక చింతనతో తనను తాను మార్చుకునేందుకు 41 రోజుల దీక్ష ఉంటుంది. హరిహరసుతుడు అయ్యప్ప. ఇందులో అయ్య అంటే.. విష్ణువు. అప్ప అంటే.. శివుడి పేర్ల సంగమంతో అయ్యప్పనామం ఆవిర్భవించింది. మహిషా అనే రాక్షసుడిని సంహరించి అయ్యప్ప కేరళలోని శబరిమలైలో వెలిశాడు. దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో శబరిమలై అయ్యప్ప ఆలయం ఒకటి. దీక్షలు ఆధ్యాత్మికం, మానవ విలువలను పెంపొందించుకునేందుకు దోహదపడతాయి. మాలధారణ, నల్లని వస్త్రధారణ, చన్నీటి స్నానం, విభూది, చందనం, కుంకుమలతో అలంకరించుకోవడం వంటి ఆచారాలు ఆధ్యాత్మికతకు ఉపకరిస్తాయి. శరీరంపై బస్మధారణ ఈశ్వర సంకేతానికి, నుదుటిపై మెరిసే తిరునామం విష్ణుమూర్తిని గుర్తు చేస్తుంది.
41 రోజుల అయ్యప్ప దీక్ష ద్వారా మనిషి ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. భక్తిభావంతోపాటు ఆహార అలవాట్లలో మార్పుల కోసం అనేక మంది నియమ నిష్టలతో దీక్షను చేపడతారు. ఉదయాన్నే నిద్రలేవడం చైతన్యానికి ప్రతీకగా, సూర్యోదయానికి ముందే చన్నీటి స్నానంతో నాడీ వ్యవస్థ ఉత్తేజపర్చడం, నేలమీద పడుకోవడం ద్వారా వెన్నునొప్పుల సమస్యలు తగ్గిపోవడం, కండరాల పటిష్టత, రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడేందుకు దోహదపడుతుంది. నిత్య దీపారాధనతో మనస్సు తేలికపడి స్నేహం, ప్రేమానురాగాలు పెరుగుతాయి. పొగతాగడం, మద్యపానం వంటి దురలవాట్లకు దూరంగా ఉండడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయ్యప్ప దీక్ష ఆరోగ్యానికి ఆరోగ్య రక్షగా ఉంటుంది.
అయ్యప్ప దీక్ష నియమాలు ఎంతో కఠినంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతనతో మనసు ప్రశాంతంగా.. పవిత్రంగా మారుతుంది. అయ్యప్ప మాల ధరించడం ద్వారా క్రమశిక్షణ అలవడుతుంది. మనస్సు, శరీరాన్ని పవిత్రం చేసుకోవడం అయ్యప్ప మాలధారణ ప్రత్యేకత. నిష్టతో దీక్షలు చేసేవారు ఆదర్శంగా నిలుస్తారు. గురుస్వామిగా దీక్ష ధరించిన మాలధారులకు తనవంతు నియమాలు సూచిస్తూ అయ్యప్ప దీక్ష విశిష్టతను చెబుతున్నాయి. ఇప్పటికీ 30 సార్లు అయ్యప్ప దీక్ష తీసుకున్నాను.
అయ్యప్ప మాల ధరించిన దీక్షాపరుల్లో జీవన ప్రమాణాలను పెంచుతుంది. ప్రతి ఒక్కరూ తన విధిని గుర్తిస్తారు. సంఘంలో ఎలా ఉండాలో నేర్చుకుంటారు. తోటి వారిని ఎలా గౌరవించాలి.. మర్యాదపూర్వకంగా మెలగాలనేది దీక్షా నియమం నేర్పుతుంది. సమైక్యత, స్నేహభావం పెంపొందిస్తుంది. నడవడిక మెరుగుపడడమే కాకుండా ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగి దీక్ష తీసుకున్న తర్వాత ఆరోగ్యానికి రక్ష అవుతుంది.
అయ్యప్ప మాలధారణ ఎంతో పవిత్రమైనది. మాల ధరించడం వల్ల మనిషిలో మానవతా విలువలు పెంపొందుతాయి. 27 ఏళ్లుగా అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నా. నడవడిక, ఆరోగ్యం, జీవన విధానంలో అనేక మా ర్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా క్రమశిక్షణ అలవడుతుంది. అయ్యప్ప దీక్షాధారణ నియమాలు మనిషి ఎదుగుదలకు ఎంతో దోహదపడతాయి.
అయ్యప్ప దీక్ష తీసుకున్న తర్వాత దీక్షా నియమాలు కఠినంగా ఉంటాయి. నిత్యం అయ్యప్ప నామస్మరణ చేస్తుండడంతో మానసిక ప్రశాంతత కలుగుతుంది. భక్తిభావం ఏర్పడుతుంది. తొలిసారి అయ్యప్ప మాల ధరించాను. కన్నెస్వామిగా ఉన్న నాలో గురుస్వాములు అయ్యప్పను చూస్తారు. 41 రోజుల దీక్షతో ఆరోగ్యంలో, ఆహార అలవాట్లతో మార్పులు చోటుచేసుకున్నాయి. అయ్యప్ప దీక్ష నియమాలతోపాటు ఆరోగ్యానికి ఎంతో ఉపకరిస్తుంది.