కొత్తగూడెం క్రైం, అక్టోబర్ 25: మద్యం మత్తులో మిత్రుల మధ్య ఘర్షణ హత్యకు దారి తీసింది. స్నేహితుడిపై మరో స్నేహితుడు దాడి చేసి కడతేర్చిన ఘటన సోమవారం కొత్తగూడెం జిల్లాకేంద్రంలో చోటుచేసుకున్నది. కొత్తగూడెం త్రీ టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని గాజులరాజం బస్తీకి చెందిన బడికెల సందీప్ (23), పల్లం సాయికుమార్ ప్రాణమిత్రులు. ఇద్దరూ మద్యానికి బానిసలయ్యారు. సోమవారం దీపావళి సందర్భంగా ఇద్దరూ మద్యం తాగారు. సాయంత్రం గణేశ్ టెంపుల్ సమీపంలోని పాన్ షాపునకు వెళ్లి సిగరెట్లు, అగ్గిపెట్టె తీసుకుని డబ్బులు ఇవ్వకుండా వెనుదిరిగారు.
దుకాణ యజమానికి డబ్బులు ఇవ్వకపోవడాన్ని సాయికుమార్ విభేదించాడు. ఈ క్రమంలో స్నేహితుల ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అది ఘర్షణకు దారి తీసింది. సందీప్పై సాయికుమార్ పిడిగుద్దులు కురిపించాడు. పక్కనే ఉన్న సిమెంట్ ఇటుకతో విచక్షణా రహితంగా దాడి చేశాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ ముసుకు అబ్బయ్య, సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న సందీప్ను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సందీప్ను అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. సాయికి నేర చరిత్ర ఉందని, ఇటీవల అతడు ఓ కేసులో జైలు నుంచి విడుదలై బయటకు వచ్చినట్లు తెలుస్తున్నది.