కూసుమంచి,జూన్ 9: వివిధ శాఖల్లోని ఉద్యోగ ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్లు ఇచ్చింది. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసిన వారికి చేయూతనందించేందుకు పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి నేతృత్వంలోని కందాళ ఫౌండేన్ ముందుకొచ్చింది. ఇప్పటివరకూ హైదరాబాద్కే పరిమితమైన శిక్షణ కేంద్రాన్ని ఈ ఫౌండేషన్ ఏకంగా పాలేరు నియోజకవర్గంలోని గోపాలరావుపేటకు తీసుకొచ్చింది.
ఏర్పాటు ఇలా..
కూసుమంచిలో ఈ శిక్షణ కేంద్రాన్ని ఫౌండేషన్ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అనూహ్యంగా 1,400 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. దీంతో, అక్కడ వసతి చాలకపోవడంతో కూసుమంచి సమీపంలోని గోపాల్రావుపేట వద్దనున్న జిన్నింగ్ మిల్లులో శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వీరందరికీ స్టడీ మెటీరియల్ ఉచితంగా ఇస్తున్నారు. మధ్యాహ్న భోజనం కూడా ఉచితంగానే అందిస్తున్నారు. వేడి, ఉక్కపోత ఉండడంతో బ్లోయర్ ఏసీలను కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి నిష్ణాతులైన అధ్యాపకులు మూడు రోజులకు ఒకరు చొప్పున వస్తున్నారు. అర్థమెటిక్, జాగ్రఫీ, పాలిటిక్స్, ఎకానమీ, హిస్టరీ, కరెంట్ అఫైర్స్, జీకే, ఇంగ్లిష్, తెలుగు, కల్చరల్ తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. పోలీస్ ఉగ్యోగార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయం 8.30 నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు తరగతులు జరుగుతున్నాయి. చెప్పిన అంశాలపై ప్రతి రోజూ పరీక్షలు పెడుతున్నారు. వారాంతంలో గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ఇవన్నీ కూడా.. ప్రభుత్వం నిర్వహించే పోటీ పరీక్ష నమూనాలోనే ఉంటున్నాయి. కటాఫ్ మార్క్ నిర్ణయించడంతో ఉద్యోగార్థులు తమ స్థాయిని, శక్తి సామర్థ్యాలను స్వయంగా అంచనా వేసుకోగలుగుతున్నారు. మంచి మార్కులు సాధించిన వారిని ప్రోత్సహించేందుకు నిర్వాహకులు బహుమతులను కూడా అందిస్తున్నారు.
హాజరు, ఖర్చు..
దరఖాస్తు చేసుకున్న 1,400 మందిలో ప్రతి రోజూ 500 నుంచి 600 మంది వరకు (60 శాతం మంది యువతులు, 40 శాతం మం ది యువకులు) హాజరవుతున్నారు. గ్రాండ్ టెస్ట్ రోజున ఈ సంఖ్య 700 నుంచి 750 వరకు ఉంటున్నది. శిక్షణ పూర్తయ్యేంత వరకు (75 రోజులు) సగటున ఒక్కో విద్యార్థికి రూ.20 నుంచి 25వేల వరకు ఖర్చవుతుందని కందాళ ఫౌండేషన్ నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
యువత భవత కోసమే..
పాలేరు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత ఉద్యోగాలు సాధించాలన్న లక్ష్యంతోనే కందాళ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. హైదరాబాద్ వరకు వెళ్లి శిక్షణ తీసుకోవడమనేది కొందరికి ఆర్థికంగా, మరికొందరికి ఇతరత్రా కారణాలతో సాధ్యపడకపోవచ్చు. అందుకే, అందరికీ అందుబాటులో ఉండేలా శిక్షణా కేంద్రాన్నే ఇక్కడకు తీసుకొచ్చాం. ఇక్కడ శిక్షణ పొందుతున్న వారిలో కొంతమందికి ఉద్యోగాలు వచ్చినా.. నా లక్ష్యం నెరవేరినట్లే.
– కందాళ ఉపేందర్ రెడ్డి, పాలేరు ఎమ్మెల్యే
చక్కటి అవకాశం
పోటీ పరీక్షలకు శిక్షణ కోసం గతంలో హైదరాబాద్కు వెళ్లాల్సి వచ్చేది. పేద కుటుంబాలకు చెందిన ఉద్యోగార్థులకు ఇది భారంగా ఉండేది. మా ఎమ్మెల్యే ఏకంగా ఇక్కడే కోచింగ్ సెంటర్ పెట్టించారు. మా నియోజకవర్గంలోని ఉద్యోగార్థులకు చక్కటి అవకాశం.
– ఇంటూరి శేఖర్
కోచింగ్ బావుంది
కోచింగ్ చాలా బావుంది. మంచి ఫ్యాకల్టీ ఉంది. మాకు కావాల్సిన రీతిలో కోచింగ్ ఇస్తున్నారు. నేను నేలకొండపల్లి గురుకులంలో ఔట్సోర్సింగ్ పీఈటీగా పనిచేస్తున్నా. కానిస్టేబుల్, ఎస్సై, ఇతర పోటీ పరీక్షల కోసం శిక్షణ తీసుకుంటున్నా.
– ఊర్మిళ, నేలపట్ల
స్థానికంగానే మంచి కోచింగ్
నేను డిగ్రీ పూర్తిచేశాను. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం వచ్చాను. కోచింగ్ బాగుంది. హైదరాబాద్ ఫ్యాకల్టీని రప్పిస్తున్నారు. రోజువారీగా, ప్రత్యేకంగా వారానికోసారి పరీక్షలు పెడుతున్నారు. స్వీయ అంచనాకు వీటి ఫలితాలు ఉపయోగపడుతున్నాయి.
– సాయికుమార్, రాజుపేట బజార్
పరీక్ష ఎలా ఉంటుందో తెలుస్తుంది
ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాగానే ఇక్కడ కోచింగ్ సెంటర్ ప్రారంభమైంది. దీంతో, బయటకు వెళ్లాల్సిన అవసరం తప్పింది. ఇక్కడ ప్రతి రోజూ నిర్వహించే పరీక్షలతో.. అసలు పరీక్ష ఎలా ఉం టుందో తెలుస్తున్నది. మెటీరియల్ ఇస్తున్నారు. మధ్యాహ్న భోజనం పెడుతున్నారు.
– నాగమణి, గంగబడ తండా