భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ప్రస్తుతం సర్కార్ కొలువుల జాతర కొనసాగుతున్నది. మూడునెలల నుంచి అభ్యర్థులు పోటీ పడి మరీ చదువుతున్నారు. నిరంతరం పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. పేద కుటుంబాలకు చెందిన అభ్యర్థులు ప్రభుత్వ గ్రంథాలయాలనే ఆశ్రయిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే ఉండి చదువుకుంటున్నారు. పోటీ పరీక్షలకు కావాల్సిన స్టడీ మెటీరియల్ను రాష్ట్ర ప్రభుత్వం గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచింది. నాడు అధ్వాన్నంగా ఉన్న గ్రంథాలయాలను ప్రత్యేక చొరవతో సకల సౌకర్యాలతో అభివృద్ధి చేసింది. ఈ నేపథ్యంలో తమవంతుగా రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ‘జీఎస్ఆర్ ట్రస్ట్’ పేరుతో విద్యార్థులకు సేవ చేస్తున్నారు. జిల్లా గ్రంథాలయంలో ఉచితంగా భోజనం, వైఫై సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. దీంతో అభ్యర్థులు మధ్యాహ్నం ఇంటికి వెళ్లకుండా పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు ‘సర్కార్ జాబ్ కొట్టాలి’ అనే కృతనిశ్చయంతో చదువుతున్నారు.
వారానికో గ్రాండ్ టెస్ట్
చదువులో రాణిస్తేనే సర్కార్ నౌకరీ కొట్టేయొచ్చు.. అందుకే అభ్యర్థులకు వారానికో మాక్ టెస్టు పెట్టాలని నిర్ణయించారు. హెల్త్ డైరెక్టర్ ఏర్పాటు చేసిన ట్రస్ట్ నిర్వాహకులు గ్రంథాలయంలో చదువుతున్న అభ్యర్థులకు వారానికోసారి మాక్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. దీంతో వారిలో కొత్త జోష్ నిండుతున్నది. పోటీ పడి చదువుతూ ముందుకెళ్తున్నారు.
సర్కారు కొలువు సాధించాలంటే పుస్తకాల పఠనం చేయాల్సిందే. అలాంటి పుస్తకాలు మన జిల్లా గ్రంథాలయంలో ప్రభుత్వం సమకూర్చింది. వివిధ రకాల పత్రికలు, పోటీ పరీక్షల మెటీరియల్ ఉండడంతో అభ్యర్థులు ప్రతిరోజూ అభ్యసనం చేస్తున్నారు. ఇప్పటికే జీఎస్ఆర్ ట్రస్ట్ గ్రంథాలయానికి కొత్త పుస్తకాలను సైతం అందజేసింది. ఇటీవల అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు చేస్తున్న సేవలను తెలుసుకుని తమకు భోజన సౌకర్యంతోపాటు వైఫై కల్పించాలని అభ్యర్థించారు. దానికి స్పందించిన ఆయన పరీక్షలు ముగిసే వరకు గ్రంథాలయంలో భోజన వసతి కల్పించేందుకు ముందుకొచ్చారు. వెంటనే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతోపాటు వైఫై కూడా ఇచ్చేశారు. సాయంత్రం సమయంలో టీ కూడా ఇస్తున్నారు.
మంచి భోజనం పెడుతున్నారు..
కొత్తగూడెం టౌన్లోనే ఉంటున్నప్పటికీ చదువు మధ్యలో ఇంటికెళ్తే ఆసక్తి పోతుంది. హెల్త్ డైరెక్టర్ సార్ మంచి నిర్ణయం తీసుకున్నారు. ఉదయం ఇంటి నుంచి వచ్చే సమయంలో లంచ్ తీసుకు రావాలంటే ఆ సమయానికి అవదు కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఇంటికి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ‘జీఎస్ఆర్’ మంచి భోజనం పెడుతున్నారు. టీ కూడా ఇస్తున్నారు.
– పి. అనులత, కొత్తగూడెం, అభ్యర్థి
జీఎస్ఆర్ ట్రస్ట్ సేవలు మరువలేనివి
రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు సార్ పెట్టిన జీఎస్ఆర్ ట్రస్ట్ సేవలు చాలా ఉపయోగపడుతున్నాయి. గ్రంథాలయంలో భోజనం పెట్టడం గొప్ప విషయం. పరీక్షలు అయ్యేవరకు పెడుతామని చెప్పారు. అందరికీ వైఫై చాలా అవసరం రిఫర్ చేయాలంటే నెట్ ఉండాల్సిందే. మంచి ఆలోచన చేశారు. వైపై సేవలు, వైద్యసేవలు కూడా అందిస్తున్నారు. – శిరీష, కొత్తగూడెం, అభ్యర్థి