ముదిగొండ, మార్చి 1 : రాష్ట్రంలోనే మధిర నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర చర్యలు చేపట్టినట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. శుక్రవారం కట్టకూరు-సీతారాంపురం, గోకినేపల్లి-మేడేపల్లి, గోకినేపల్లి-కట్టకూరు గ్రామాల మధ్య రూ.11 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. తర్వాత గోకినేపల్లిలో 58 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ప్రజలు కోరుకున్న ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని, మంచి పాలన అందించి వారికి అన్ని విధాలా న్యాయం చేస్తామన్నారు. నాణ్యతలో రాజీ లేకుండా శంకుస్థాపన చేసిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. తాము ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు.
ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు చేసిన పాదయాత్రలో తనకు ఎదురైన అనుభవాలతోనే బడ్జెట్ రూపొందించామన్నారు. నిరుద్యోగుల కోసం ప్రతి నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ త్వరలోనే ఏర్పాటు చేసి ఆన్లైన్ ద్వారా కోచింగ్ అందిస్తామన్నారు. అనంతరం గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించారు. స్వయంగా బిల్లు తీసి లబ్ధిదారులకు అందించారు. కార్యక్రమంలో కలెక్టర్ గౌతమ్, పీఆర్ ఎస్ఈ చంద్రమౌళి, ఆర్అండ్బీ ఎస్ఈ శ్యాంప్రసాద్, డీఈవో సోమశేఖర శర్మ, డీపీవో హరికిషన్, మిషన్ భగీరథ ఈఈ పుష్పలత, ఎంపీపీ సామినేని హరిప్రసాద్, జడ్పీటీసీ పసుపులేటి దుర్గ, తహసీల్దార్ వై.రామారావు, ఎంపీడీవో శ్రీధర్ స్వామి పాల్గొన్నారు.