సత్తుపల్లి టౌన్, మే 25 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి గెలుపు కోసం ప్రతి గ్రాడ్యుయేట్ను కలిసి ఓట్లు అభ్యర్థించాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాకేశ్రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సరళిపై మండల నాయకులతో సత్తుపల్లిలోని తన కార్యాలయంలో శనివారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ బూత్లలో చేపట్టిన ప్రచారం, ఓటరును కలుసుకుంటున్న విధానం తదితర అంశాలను పర్యవేక్షించాలని నాయకులకు సూచించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి, బ్లాక్ మెయిలర్ తీన్మార్ మల్లన్న నిజస్వరూపం అందరికీ తెలుసని, ఆయనకు, విద్యావంతుడు, సేవాగుణం కలిగిన రాకేశ్రెడ్డి మధ్య తేడాను వివరించి ఓట్లు అభ్యర్థించాలన్నారు. మరోసారి గ్రామాల్లో గ్రాడ్యుయేట్ ఓటర్ల వివరాలను చూసుకుని అందరినీ కలిసి ఓట్లను అభ్యర్థించాలని కోరారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, దొడ్డా శంకర్రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు యాగంటి శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షుడు రఫీ తదితరులు పాల్గొన్నారు.