కొత్తగూడెం అర్బన్, ఆగస్టు 15 : పినపాక, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, హరిప్రియ సహా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులను భద్రాద్రి జిల్లా పోలీసులు గురువారం అరెస్టు చేశారు. భద్రాద్రి జిల్లాలోని పినపాక నియోజకవర్గంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఉద్యమ సారథి కేసీఆర్ నిర్మించిన సీతారామ ప్రాజెక్టు నీళ్లను పినపాక, ఇల్లెందు నియోజకవర్గాలకు; భద్రాద్రి జిల్లాలకు ఇవ్వకుండా ఖమ్మం జిల్లా మంత్రులు వారి నియోజకవర్గాలకు తరలించుకు వెళ్తుండడాన్ని నిరసిస్తూ రేగా కాంతారావు, హరిప్రియలు గురువారం ఆందోళనకు పిలుపునిచ్చిన విషయం విదితమే.
భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద సీతారామ ప్రాజెక్టు రెండో పంపుహౌస్ను సీఎం రేవంత్రెడ్డి గురువారం ప్రారంభించనున్న నేపథ్యంలో ఆ ప్రారంభోత్సవాన్ని బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి వెళ్లి వీరు అడ్డుకుంటారేమోననే ఆలోచనతో భద్రాద్రి జిల్లా పోలీసులు గురువారం వీరిని ముందస్తు అరెస్టు చేశారు. బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రేగా కాంతారావు.. జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో గురువారం ఉదయం వేళ స్వాతంత్య్ర దినోత్సవ జెండాను ఎగురవేశారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న రేగా కాంతారావు, హరిప్రియ సహా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులను పోలీసులు అడ్డుకొని అక్రమంగా అరెస్టు చేశారు.
తమనెందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలంటూ డీఎస్పీ రెహమాన్ను రేగా కాంతారావు, హరిప్రియానాయక్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన చేసే హక్కు లేదా అంటూ ప్రశ్నించారు. తాము శాంతియుతంగానే నిరసన చేసేందుకు వెళ్తున్నామని అన్నారు. తమను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు. అయినప్పటికీ వారి మాటలను పోలీసులు పట్టించుకోలేదు. అక్రమంగా అరెస్టు చేసి పోలీసు వాహనాల్లోకి ఎక్కించారు. ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియను మహిళా పోలీసులు ముందుకు నెట్టివేసి మరీ పోలీసు వాహనంలోకి ఎక్కించారు. అయితే, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, నాయకుల అరెస్టుకు నిరసనగా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
పోలీసుల వాహనాలకు అడ్డుగా నిలుచొని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పార్టీ కార్యాలయం వద్ద కొంత ఉద్రిక్తత నెలకొంది. కార్యకర్తలను పోలీసులు నెట్టివేసి మాజీ ఎమ్మెల్యేలను, బీఆర్ఎస్ నేతలను కొత్తగూడెం వన్టౌన్, సుజాతనగర్ పోలీసుస్టేషన్లకు తరలించారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగల రాజేందర్, చుంచుపల్లి మాజీ ఎంపీపీ బాదావత్ శాంతి, బీఆర్ఎస్ నాయకులు తొగరు రాజశేఖర్, మోరె భాస్కర్రావు, సంకుబాపన అనుదీప్, సింధు తపస్వి, లకావత్ గిరిబాబు, లావూడ్యా సత్యనారాయణ, ముద్దంగుల కృష్ణ, లక్ష్మణ్, అన్నపునేని రమణ, ఆవుల నరసింహారావు, రామారావు, పోశెట్టి రవి, రామకోటి తదితరులు ఉన్నారు.
ఇల్లెందు రూరల్, ఆగస్టు 15: సీతారామ ప్రాజెక్టు నీళ్లను ఇల్లెందు ఏజెన్సీకి ఇవ్వకుండా మైదాన ప్రాంతాలకు తరలించుకుపోతుండడాన్ని నిరసిస్తూ సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నేతలు భద్రాద్రి జిల్లా ఇల్లెందులో గురువారం ఆందోళన చేపట్టారు. ఇల్లెందు ఏజెన్సీ వ్యవసాయ రంగానికి సీఎం రేవంత్రెడ్డి తీవ్ర అన్యాయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. అయితే అక్కడకు చేరుకున్న పోలీసులు.. నిరసనకారులను అరెస్టు చేశారు. ఎన్డీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అవునూరి మధు సహా ఆ పార్టీ నేతలు తుపాకుల నాగేశ్వరరావు, కొక్కు సారంగపాణి, నాయకులు నందగిరి వెంకటేశ్వర్లు, తోడేటి నాగేశ్వరరావులను అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్కు తరలించారు.