దుమ్ముగూడెం, ఏప్రిల్ 12: అధికారం చేపట్టిన నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ పాలకులు ఆరు గ్యారెంటీలను అటకెక్కించారని రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ విమర్శించారు. ఇప్పటి వరకూ పింఛన్ల జాడ లేదని, రైతుబంధు ఇవ్వలేదని, రుణమాఫీ చెయ్యలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసకారి అని, కేవలం మోసాలతోనే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు. ఆరు గ్యారెంటీల పేరు చెప్పి రాష్ట్ర ప్రజలను ఆ పార్టీ నిలువునా మాయచేసిందని దుయ్యబట్టారు. హామీలను తుంగలో తొక్కి నాలుగు నెలలుగా ఆ పార్టీ చేస్తున్న మోసాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. దుమ్ముగూడెం మండలం గంగోలు గ్రామంలో శుక్రవారం ఏర్పాటుచేసిన బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. గత పార్లమెంటు ఎన్నికల్లో ఇక్కడి ప్రజల ఆశీర్వాదంతో లక్ష మెజార్టీతో గెలిచిన మాలోత్ కవితను.. పార్టీ అధినేత కేసీఆర్ ఈసారి కూడా ఎంపీ అభ్యర్థిగా పంపారని వివరించారు. ఈ ఎన్నికల్లోనూ ఆమెను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అలాగే, గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను, ఆ తరువాత చేసిన మోసాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత మాట్లాడుతూ.. భద్రాద్రి జిల్లా ప్రజలు ఎప్పటికీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంటే ఉంటారని అన్నారు. గత ఎన్నికల్లోనూ తనకు అత్యధిక మెజార్టీ ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు మరోసారి కూడా గెలిపిస్తేనే పార్లమెంట్లో ఇక్కడి సమస్యలపై గొంతెత్తి ప్రశ్నించే అవకాశం ఉంటుందని అన్నారు. దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో త్రీఫేజ్ విద్యుత్ లేని విషయాన్ని బండిరేవు గ్రామానికి చెందిన ఆదర్శ రైతు శ్రీనివాసరాజు (వాసురాజు) అప్పట్లో కేసీఆర్కు తెలిపారని గుర్తుచేశారు. దీంతో వెంటనే స్పందించిన అప్పటి కేసీఆర్ ప్రభుత్వం తక్షణమే రూ.290 కోట్లు మంజూరు చేసి ఇక్కడ త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యాన్ని కల్పించిందని జ్ఞప్తికి తెచ్చారు. పోడు భూములకు పట్టాలు, వాటికి రైతుబంధు సాయాలు అందించిన ఘనత ముమ్మాటికీ కేసీఆర్కే దక్కుతుందని స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. భద్రాచలం ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వెళ్లిన తెల్లం వెంకట్రావు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవుచెప్పారు. బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రెస్లోకి వెళ్లడమంటే నమ్మి ఓట్లేసిన ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. అలాగే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కూ బుద్ధి చెప్పాలని ఇక్కడి ప్రజలకు పిలుపునిచ్చారు. డిసెంబర్ 9 తర్వాత రుణమాఫీ చేస్తామని, కొత్త రుణాలు తెచ్చుకోవాలని, ధాన్యానికి బోనస్ ఇస్తామని, రూ.4 వేల పింఛన్లిస్తామని హామీలిచ్చిన ఆ పార్టీ నేతలు.. ఇప్పుడు ఏప్రిల్ 11 దాటినా వాటి ఊసే ఎత్తట్లేదని, హామీలపై నోరు మెదపట్లేదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ నాయకులు అన్నె సత్యనారాయణమూర్తి, కణితి రాముడు, రేసు లక్ష్మి, జానీపాషా, వాసురాజు, మానే రామకృష్ణ, రావులపల్లి రాంప్రసాద్, తాండ్ర వెంకటరమణ, సోయం రాజారావు, కోదండరామయ్య, లంకా రాజు, కొత్తూరు సీతారామారావు తదితరులు పాల్గొన్నారు.