ఖమ్మం, ఫిబ్రవరి 20: రాష్ట్ర పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకుందామని రాష్ట్ర మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరూ కార్యోన్ముఖులై పనిచేయాలని సూచించారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు, డివిజన్ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో ఖమ్మంలోని మమత ఆసుపత్రి ఆవరణలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కష్టకాలంలో ప్రతి ఒక్కరూ పార్టీకి అండగా నిలవాలని అన్నారు.
కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పదవుల్లో ఉన్న పజాప్రతినిధులు ప్రజల మధ్యలో ఉంటూ కార్యకర్తలకు మద్దతుగా నిలబడాలని సూచించారు. బీఆర్ఎస్కు మంచి కాలం రాబోతోందని, ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు. ఈ సమావేశంలో కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు కూరాకుల నాగభూషణం, కార్పొరేటర్ కర్నాటి కృష్ణ, బీఆర్ఎస్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, వీరూనాయక్, మెంతుల శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.