ఖమ్మం సిటీ, జూలై 22: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి కారణంగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు సార్థకమైందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న అద్భుతమైన నిర్ణయాలు, దూరదృష్టి, నిరంతర కృషి ఫలితంగానే జిల్లా ప్రజలకు నీళ్లు అందుతున్నాయని గుర్తుచేశారు. ప్రస్తుతం రోజుకు 1,600 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారంటే ఉద్యమనేత ఆలోచనలు, సహకారమే కారణమని స్పష్టం చేశారు.
జిల్లాలోని కరువు ప్రాంతాలకు సాగునీరు అందుతున్న కారణంగా రైతులకు ఎంతో ఉపశమనం లభిస్తున్నదని, వ్యవసాయ రంగానికి ఇది మరింత బలాన్ని చేకూరుస్తోందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీతారామ ప్రాజెక్టు నిర్మాణం కోసం సుమారు రూ.9 వేల కోట్ల నిధులు వెచ్చించి, 100 కి.మీ పైగా ప్రధాన కాలువలు, పంపుహౌస్లు, పైపులైన్లు, ట్రాన్స్మిషన్ వ్యవస్థలను నిర్మించామని గుర్తుచేశారు. అధిక సామర్థ్యం కలిగిన మోటర్లు, ఆధునిక యంత్ర పరికరాలు, భారీ పంపింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసి ప్రాజెక్టు పనుల్లో గణనీయమైన పురోగతిని సాధించామని జ్ఞప్తికి తెచ్చారు. సీతారామ ప్రాజెక్టు ఖమ్మం జిల్లా రైతుల భవిష్యత్తును మార్చే కీలక ప్రాజెక్టు అని అన్నారు. కేవలం వర్షాధార ప్రాంతాలకు సాగునీరు లభిస్తోందని, తమ ప్రభుత్వం చేసిన కృషిని జిల్లా ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని పేర్కొన్నారు. ఆ ప్రాజెక్టు వల్లనే ఉమ్మడి జిల్లా సస్యశ్యామలం స్వప్నం సాకారమైందని అన్నారు.