బోనకల్లు, మే 24: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు. ఈ ఆరు నెలల్లో అబద్ధాల ఆరు గ్యారెంటీలను గమనించిన రాష్ట్ర ప్రజలు ‘వద్దురా నాయనా.. మాకు ఈ కాంగ్రెస్ పాలన’ అంటున్నారని అన్నారు. ప్రజల ఆలోచనలు, వారి మాటలే బీఆర్ఎస్ అభ్యర్థి విజయాన్ని స్పష్టం చేస్తున్నాయని అన్నారు. ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అధ్యక్షతన బోనకల్లులోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి మాట్లాడారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకూ జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుచుకుంటూ వస్తున్నారని గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో కూడా ఇదే పునరావృతమవుతుందని స్పష్టం చేశారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పని అయిపోయిందని అన్నారు.
ఇప్పటికీ ఈ ప్రభుత్వం ప్రజలను వంచిస్తూనే పాలన చేస్తోందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఉచిత బస్సే కాదని.. మిగిలిన అన్ని హామీలూ బుస్సే అయ్యాయని విమర్శించారు. రూ.15 వేల రైతు భరోసా, నిరుద్యోగులకు ఉద్యోగ భృతి, మహిళలకు రూ.2500, ఆడపిల్లలకు కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం ఇస్తామని హామీలిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు వాటిల్లో ఏ ఒక్కదానినీ అమలుచేయకుండా ప్రజలను మోసిందని దుయ్యబట్టారు. నాడు కేసీఆర్ ప్రభుత్వం 24 గంటలూ విద్యుత్ సరఫరా చేస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దానిని 14 గంటలు చేసిందని తూర్పారబట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మండలాలను ఆంధ్రాలో కలిపిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు.. హైదరాబాద్ను మరో పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా చేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మధిర ప్రాంతానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే లేనప్పటికీ.. ఎమ్మెల్సీగా రాకేశ్రెడ్డిని గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తాడని అన్నారు. బీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు కొండబాల కోటేశ్వరరావు, పెద్దిరెడ్డి సుదర్శన్రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, బిచ్చాల తిరుమలరావు, మొండితోక జయాకర్, బంధం శ్రీనివాసరావు, బానోతు కొండా, బొమ్మెర రామ్మూర్తి, చేబ్రోలు మల్లికార్జునరావు, రావూరి శ్రీనివాసరావు, వాచేపల్లి లక్ష్మారెడ్డి, కనుమూరి వెంకటేశ్వరరావు, పంబి సాంబశివరావు, పెంట్యాల పుల్లయ్య, మోదుగుల నాగేశ్వరరావు, యన్నం శ్రీనివాసరెడ్డి, బొడ్డు వెంకటరామారావు, అరిగె శ్రీనివాసరావు, బొగ్గుల భాస్కర్రెడ్డి, శీలం కవిత తదితరులు పాల్గొన్నారు.