ఖమ్మం, మే 5: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యలు ఆక్షేపణీయమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. సీఎం కుర్చీలో ఉన్న ఆయన.. ‘తొండలు వదలడం, గుడ్లు పీకడం’ వంటి చిల్లర మాటలు మాట్లాడడం హుందాతనం కాదని తేల్చిచెప్పారు. మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఇంతటి నీచమైన వ్యాఖ్యలు చేయడం ఎంత వరకూ సమర్థనీయమో ఆయనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో ఆదివారం పర్యటించిన ఆయన.. 49వ డివిజన్ మామిళ్లగూడెంలో ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం స్థానం నుంచి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఇల్లిల్లూ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. టిఫిన్ సెంటర్లు, కిరాణా దుకాణాలు, ఇస్త్రీ షాపుల వద్ద ఓటర్లను వద్ద ఓటర్లను కలిసి వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆచరణకు సాధ్యంకాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వాటిల్లో ఏ ఒక్క హామీని నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డికు పాలనపై అవగాహన లేక దేవుళ్లపై ఒట్లతో నెట్టుకొస్తున్నారని విమర్శించారు. రైతుల రూ.2 లక్షల రుణమాఫీ విషయంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తూర్పారబట్టారు.
కేసీఆర్ లేని తెలంగాణను ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని మాజీ మంత్రి అజయ్ పేర్కొన్నారు. అందుకే ఈ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతున్నారని, పార్టీ అభ్యర్థి నామాకు భారీ మెజార్టీ అందించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా ఖమ్మంలో నీటి కష్టాలను తీర్చలేక పోతున్నారని దుయ్యబట్టారు. ఇకనుంచైనా ప్రజలకు మంచి జరగాలంటే పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావును గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అందుకోసం కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. బీఆర్ఎస్ నాయకులు పగడాల నాగరాజు, పొన్నం వెంకటేశ్వర్లు, మన్నె వెంకటరమణ, శీలంశెట్టి వీరభద్రం, పవన్, రంగాచారి, కోటేశ్వరరావు, రంగారావు, నల్లమోతు కోటయ్య, వేణు, సుధీర్, ప్రతాప్, శ్రీను పాల్గొన్నారు.
420 హామీలతోనే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి అజయ్ విమర్శించారు. ఖమ్మం 3వ డివిజన్ బల్లెపల్లి, 5వ డివిజన్ బొడ్డురాయి సెంటర్, ఎస్సీ కాలనీల్లో స్థానిక కార్పొరేటర్లు, డివిజన్ నాయకులతో కలిసి నిర్వహించిన ప్రచారంలో ఆయన మాట్లాడారు. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ప్రజలను ఇబ్బందులపాలు చేస్తోందని దుమ్మెత్తిపోశారు. ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం మేడలు వంచాలంటే ఖమ్మంలో బీఆర్ఎస్ అభ్యర్థి నామా గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.