భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 25 (నమస్తే తెలంగాణ): స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం వెన్ను దన్నుగా నిలుస్తున్నది. మహిళలకు పావలా వడ్డీపై రుణాలు ఇచ్చి స్వయం ఉపాధి పొందేందుకు చేయూతనిస్తున్నది. అంతేగాక మెప్మా, సెర్ప్ (సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పోవర్టీ) ద్వారా స్వయం సహాయక సంఘాల్లో సభ్యులైన వారిని పంటల కొనుగోళ్లలో భాగస్వాములను చేస్తున్నది. ఐకేపీ తరహాలో సెర్ప్ ప్రయోగాత్మకంగా కార్యాచరణ రూపొందిస్తున్నది. డ్వాక్రా మహిళలను మహిళా ఉత్పత్తి దారుల సంఘాల్లో సభ్యులను చేసి వారి ద్వారా పంటలు కొనుగోలు చేయించేందుకు చర్యలు చేపడుతున్నది.
మూడు మండలాల్లో అమలు..
సెర్ప్ అధికారులు భద్రాద్రి జిల్లా ఇల్లెందు మండలం నుంచి 19, టేకులపల్లి మండలం నుంచి 14, చండ్రుగొండ నుంచి 14 మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేశారు. ఆయా సంఘాల ద్వారా మిర్చి కొనుగోళ్లు ప్రారంభించనున్నారు. ఇల్లెందు మండలంలోని కొమరారం, మాణిక్యారం, టేకులపల్లి మండలంలో మండల కేంద్రంతో పాటు కుంటల్ల, సులానగర్, చండ్రుగొండ మండలంలో పోకలగూడెం, రావికంపాడులో ఈ నెలాఖరున పంట కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.
క్షేత్రస్థాయిలో సర్వే..
సెర్ప్ అధికారులు, ఉత్పతి సంఘాల సభ్యులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పంటల కొనుగోలుపై సర్వే చేపట్టారు. మిర్చి కొనుగోలుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని గుర్తించారు. తొలి దశ కొనుగోళ్లపై దృష్టి సారించారు. ఇల్లెందు మండలంలో 588.1 ఎకరాలు, టేకులపల్లి 467.5 ఎకరాలు, చండ్రుగొండలో 348.9 ఎకరాల విస్తీర్ణంలో మిర్చి సాగు చేస్తున్న 999 మంది రైతులను స్వయంగా కలిశారు. కొనుగోలు కేంద్రాలపై అవగాహన కల్పించారు. మూడు మండలాల నుంచి సుమారు 21,573 క్వింటాళ్ల మిర్చి దిగుబడి వస్తుందని అంచనా వేసి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
కేంద్రానికో కమిటీ..
పంట కొనుగోలుపై పర్యవేక్షణకు గ్రామానికో కమిటీ ఏర్పడనున్నది. ఈ కమిటీలో గ్రామ సంఘం సహాయకురాలు, వీవో యాక్టివ్ మెంబర్, కొనుగోలు కేంద్రం మేనేజర్, 50 మంది మహిళా రైతు ఉత్పత్తిదారులు, పంట కొనుగోలు చేసే సంస్థ ప్రతినిధి, క్లస్టర్ సీసీ, రైతు ఉత్పత్తిదారుల సంఘం సీఈవో తదితరులు ఉంటారు. మెప్మా అధికారులు, డీఆర్డీవో జిల్లావ్యాప్తంగా పంట కొనుగోళ్లను పర్యవేక్షిస్తారు.
లిపిడ్ ప్లాంట్ కంపెనీతో ఒప్పందం..
రైతు ఉత్పత్తిదారుల సంఘాలు సేకరించిన మిర్చిని కేరళకు చెందిన ప్లాంట్ లిపిడ్ కంపెనీ కొనుగోలు చేయనున్నది. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మన్నెగూడెంలోని కంపెనీ ప్రాంతీయ కార్యాలయం నుంచి కంపెనీ ప్రతినిధులు పంట కొనుగోళ్లను పర్యవేక్షిస్తారు. పంట సేకరించినందుకు గాను రైతు ఉత్పత్తి సంఘం సభ్యులకు కంపెనీ కమిషన్ అందివ్వనున్నది. ఎక్కువ లాభాలు వస్తే పంట విక్రయించిన రైతులకూ వాటా ఇచ్చేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల సభ్యులు రైతులను సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. వారి నుంచి నాణ్యమైన దిగుబడులు సేకరించేందుకు కృషి చేస్తున్నారు.
ఆదాయం ఇలా..
రైతుల నుంచి రైతు ఉత్పత్తి సంఘాలు సుమారు వెయ్యి మెట్రిక్ టన్నుల పంట సేకరిస్తే కంపెనీ పంట విలువలో సంఘానికి 2 శాతం కమిషన్ ఇస్తుంది. అలాగే 3వేల మెట్రిక్ టన్నులు సేకరిస్తే 2.5 శాతం కమిషన్ అందనున్నది. ఉదాహరణకు మార్కెట్లో మిర్చి క్వింటా ధర రూ.15 వేలు ఉంటే సంఘానికి రూ.300 కమిషన్ వస్తుంది. ఇలా సేకరించిన మెట్రిక్ టన్నుల పెరిగినా కొద్దీ వాటి ఆధారంగా సంఘాలు ఆదాయాన్ని ఆర్జిస్తాయి. ఖమ్మం జిల్లాలో గతేడాది ప్రయోగాత్మకంగా ఈ విధంగా సంఘాలు పంట సేకరించగా రూ.80 లక్షల ఆదాయం వచ్చింది.
మూడు మండలాల్లో కొనుగోళ్లు..
రైతు ఉత్పత్తిదారుల సంఘాలు జిలాల్లోని మూడు మండలాల నుంచి మిర్చి సేకరించనున్నాయి. కమిషన్ పద్ధతిలో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీకి పంట అప్పగించనున్నాయి. వచ్చే నెల నుంచి మిర్చి కొనుగోళ్లు ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే పంట సేకరణకు అవసరమైన గన్నీ బ్యాగులను సిద్ధం చేస్తాం. లాభాలు ఎంత వస్తే సంఘాలు అంత బలపడనున్నాయి.
నాణ్యతకే ప్రాధాన్యం..
పంట కొనుగోలు విషయంలో నాణ్యతకే ప్రాధా న్యం. ఉత్పత్తి సంఘాల సభ్యులు ముందుగా పంట నాణ్యతను పరిశీలిస్తారు. పంటను డీలక్స్, బెస్ట్, మీడియం, యావరేజ్ రకాలుగా విభజిస్తారు. ఆయా గ్రేడింగ్ల ఆధారంగా పంట కల్లాల వద్దే జెండాపాట నిర్వహిస్తారు. అనంతరం పంటకు ధర నిర్ణయించి రైతుకు సమాచారం ఇస్తారు. రైతులకు అంగీకారమైతే వారు 48 గంటల్లోపు పంటను కేంద్రాల వద్దకు తీసుకురావాల్సి ఉంటుంది. ప్రతిరోజు నిర్వహించే జెండా పాట ఆధారంగా ఐదు రోజుల సరాసరిని లెక్కించి అధికారులు ఏరోజుకారోజు ధర నిర్ణయిస్తారు. పంట కొనుగోలు చేసిన వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో సొమ్ము జమ అవుతున్నది.