కల్లూరు, జనవరి 7: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు దీటుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. రూ.70 లక్షల ‘మన బడి’ నిధులతో కల్లూరు ప్రభుత్వ బాలుర పాఠశాలలో చేపట్టిన అదనపు గదులు, ప్రహరీ నిర్మాణ పనులను శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ‘మన బడి’ నిధుల్లో అత్యధిక శాతం కల్లూరు ప్రాథమిక పాఠశాలకే వెచ్చించామన్నారు. ఈ సందర్భంగా పనుల వివరాలు గురించి పాఠశాల హెచ్ఎం మాధవరావు, పీఆర్ జేఈ వెంకటేశ్వరరావులను అడిగి తెలుసుకున్నారు. రైతుబంధు సమితి బాధ్యులు పసుమర్తి చందర్రావు, లక్కినేని రఘు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు తదితరులు పాల్గొన్నారు.
ఆంగ్ల భాషా ఉపాధ్యాయుల సంఘం (ఎల్టా) ఆధ్వర్యంలో ఇంగ్లిష్ భాషపై విద్యార్థులకు పరీక్షలు నిర్వహించిన ప్రతిభా పాటవ పరీక్షలో నలుగురు విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారని జిల్లా కోఆర్డినేటర్ దిగుమతి శిరీష తెలిపారు. ఈ బహుమతులను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సదరు విద్యార్థులకు అందజేశారు.
కల్లూరులోని కార్పెంటర్ వృత్తి చేసుకుంటూ అనారోగ్యంతో మృతిచెందిన షేక్ ఖాదర్ కుటుంబాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శనివారం పరామర్శించారు. నాయకులు సయ్యద్అలీ, కమ్లీ, పాలెపు రామారావు, ఇస్సాక్, ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.