కూసుమంచి (నేలకొండపల్లి), ఫిబ్రవరి 18: నేలకొండపల్లి మండలలం చెరువుమాధారంలోని చెరువులో చేపలు పట్టడం ఏటా ప్రహసనంగా మారుతున్నది. చెరువులో పట్టిన చేపలను గ్రామస్తులకు తక్కువ ధరకు ఇవ్వాలని కోరుతుండడం, చేపలు ఇవ్వకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహించి అమాంతం చేపలను ఎత్తుకెళ్లడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పోలీస్ పహారా ఉంటే తప్ప గ్రామస్తులను నిలువరించే పరిస్థితి లేకపోయింది. ఈసారి కూడా “ఒక అడుగు ముందు పడితే నాలుగు అడుగులు వెనక్కి..” అన్నట్లు చేపల వేట జరుగుతున్నది. శుక్ర, శనివారాల్లో మత్స్యకారులు చేపలు పట్టేందుకు యత్నించగా గ్రామస్తులు అక్కడికి వచ్చి వేటను అడ్డుకున్నారు.
గ్రామస్తులకు తక్కువ ధరలో చేపలు ఇచ్చే విషయంలో మత్స్యకారులు, కాంట్రాక్టర్ల మధ్య విభేదాలు రావడంతోనే ఈ పరిస్థితి. కాంట్రాక్టర్లు ఆదివారం తెల్లవారుజామున ఏకంగా పెద్ద క్రేన్ను చెరువు వద్దకు తీసుకొచ్చారు. మత్స్యకారులు తెప్పలపై నుంచి చేపలు పట్టగానే జేసీబీ సాయంతో చేపలను సరాసరి కంటెయినర్లోకి వేసే విధంగా ఏర్పాట్లు చేశారు. గ్రామస్తులు దీంతో ఆగ్రహానికి గురై చేపల వేటను అడ్డుకునేందుకు యత్నించారు. ఒక దశలో ఉద్రిక్తత ఏర్పడి చెరువు పరిసర ప్రాంతమంతా బురదమయమైంది. బురదలో పడి మూడు రోజుల్లో సుమారు 5 టన్నుల చేపలు మృతిచెంది విక్రయానికి పనిరాకుండా పోయాయి. ఏదేమైనా సోమవారం తెల్లవారుజాము నుంచి తిరిగి చేపల వేట కొనసాగిస్తామని మత్స్యకారులు తెలిపారు.