ఖమ్మం ఫిబ్రవరి 26 : కాలం మారుతోంది. కాలంతోపాటు వాతావరణం మారుతోంది. కాలుష్య కారకాలు మారుతున్నాయి. మనిషి కూడా యాంత్రికంగా మారుతున్నాడు. బిజీ లైఫ్లో మనుషులు తీసుకునే ఆహార నియమాలు మారుతున్నాయి. మరి ఇన్ని మారుతున్నప్పుడు అవి ప్రభావం చూపే మనుషుల ఆరోగ్య పరిస్థితి ఎందుకు మారదు? కచ్చితంగా మారుతుంది.. అనేక రకాలైన వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలతో అనేక మంది బాధపడుతున్నారు. వైరల్ ఫీవర్, మలేరియా, డెంగీ, ప్లేట్లెట్స్ పడిపోవడం వంటి జబ్బులతో ప్రాణాలు సైతం కోల్పోతున్నారు.
ఉబకాయం, రక్తపోటు, మధుమేహం, గుండె వ్యాధులు విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నాయి. వీటన్నింటికీ కారణం ఆహార నియమావళి అదుపు తప్పడం, శరీరానికి సరైన వ్యాయామం లేక పోవడమేనని వైద్యనిపుణులు చెబుతున్నారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు, పురుషులు, స్త్రీలు, ధనికులు, సాధారణ, మధ్యతరగతి కుటుంబాలు అనే భేదాలు లేకుండా వారికున్న అనుకూలతను బట్టి వ్యాయామానికి సమయం కేటాయించాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య పరిరక్షణకు చికిత్స, మందుల వాడకానికే పరిమితం కాకుండా వాకింగ్, జాగింగ్తోపాటు జిమ్, యోగా ఇతర మానసిక, శారీరక అలసటకు సంబంధించిన వ్యాయామాలు చేస్తూ పుష్టికరమైన సంతులిత ఆహారం, పండ్లు, పండ్ల రసాలు తదితర పదార్థాలు సమపాళ్లలో తీసుకుంటే ఎటువంటి ప్రాణాంతక వ్యాధులు, జబ్బులకైనా చెక్ పెట్టవచ్చనేది వైద్యులు, వ్యాయామ నిపుణుల అభిప్రాయం.
ఫిట్నెస్ పరికరాలకు ఫుల్ డిమాండ్..
ఫిట్నెస్పై అందరూ దృష్టిసారించారు. వ్యాయామ కేంద్రాలు విస్తరిస్తుండటంతో ఫిట్నెస్ పరికరాల వ్యాపారానికి డిమాండ్ పెరిగింది. దీంతో వ్యాపారులు కొందరు ఈ పరికరాల కోసం ప్రత్యేక దుకాణాలనే నెలకొల్పుతున్నారు. గతంలో ఫిట్నెస్ పరికరాలను సుదూర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి తీసుకొచ్చేవారు. ప్రస్తుతం పరికరాల తయారీ స్థానికంగానే అందుబాటులోకి రావడంతో ఫిట్నెస్ సెంటర్లతోపాటు వ్యక్తిగతంగా కొనుగోలు చేసి ఆరోగ్యాన్ని సంరక్షించుకునేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. వ్యాయామానికి ఉపయోగించే పరికరాల్లో హోంజిమ్, మల్టీజిమ్, అబ్డామినల్, జాగర్స్, డంబెల్స్, ఏబీ ఎక్సర్సైజ్, లిఫ్ట్క్రాస్ ట్రైనర్, సీఆర్టీ ట్రాక్, ట్రెడ్మెట్, జియానసైక్ బాల్స్ వంటివి ఉన్నాయి. ఈ పరికరాలు రూ.500నుంచి మొదలయ్యే లక్షల రూపాయల వరకు ధర పలకడం విశేషం.
చిన్నారుల ఆరోగ్యం జర జాగ్రత్త…
చిన్నారులు ఎదుగుతున్న కొద్దీ వారి దేహానికి, బుద్ధి వికాసానికి కావాల్సినంత పౌష్టికాహారాన్ని అందించాలి. ఇలా అధిక పోషకాహార విలువలు కలిగిన ఆహారం అందించినప్పుడు అప్పుడే పుట్టిన బిడ్డ బరువు కేవలం ఐదు నెలల్లో రెట్టింపు అవుతుంది. ఏడాది నిండే సరికి మూడురెట్లు బరువు పెరుగుతుంది. రెండో ఏడాదిలో 7 నుంచి 8 సెంటిమీటర్ల ఎత్తు పెరుగుతారు. కొమరదశలో అడుగు పెట్టినప్పటి నుంచి వారిలో అనేక శారీరక, మానసిక మార్పులు కనిపిస్తాయి. ఇది కీలకమైన దశ, ఈ దశలో ఉన్న పిల్లలకు సరిపడా సమతుల్య ఆహారాన్ని అందంచాలి. ముఖ్యంగా కాల్షియం సమృద్ధిగా అందించాలి. ప్రతీ మనిషికి రోజుకు 600 నుంచి 800 గ్రాముల కాల్షియం అవసరమవుతుంది. ఎదిగే వయస్సులోని పిల్లలకు ఇంకాస్త ఎక్కువగా అవసరం ఉంటుంది. పాల ద్వారా కాల్షియం సమృద్ధిగా లభించే అవకాశం ఉంది. మార్కెట్లో లభించే చిరుతిండికి పిల్లలను అలవాటు చెయొద్దు. చిన్నతనం నుంచే పౌష్టికాహారంపై చిన్నారులకు అవగాహన కల్పిస్తూ ఇంటిలో ఉడికించిన పదార్థాలకు అలవాటు చేయాలి. లావు అవుతారనే ఆలోచనతో ఆహారం అందించే విషయంలో వెనుకాడకుండా, వారి సామర్థ్యాన్ని బట్టి శారీరక శ్రమకు సమయాన్ని కేటాయించేలా రోజు ఆటలు, వ్యాయామాల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి. చిన్నారులకు ఆహార నియమాలు, శారీరక శ్రమతోపాటు రోజుకు కనీసం 8 నుంచి 10 గంటలకు నిద్ర తప్పనిసరి. అంతేకాకుండా పిల్లలకు చిన్నప్పటినుంచే వ్యాయామం తప్పనిసరిగా అలవాటు చేయాలి.
అధిక బరువే అసలైన కారణం..
వయస్సుకు, పరిమితికి మించిన అధిక బరువే మనిషికున్న అసలైన పెద్ద సమస్య. సమాజంలో 30 నుంచి 40 శాతం మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. మానవదేహాన్ని అనేక రోగాలకు గురిచేసే అంశం ఉబకాయం. అధిక బరువుతో బాధపడేవారు భవిష్యత్లో మధుమేహం, కీళ్లనొప్పులు, కాలేయ సమస్యలు, గుండె జబ్బులతోపాటు అనేక రకాల మానసిక, శారీరక రుగ్మతులకు గురవుతారు. రోజురోజుకూ పెరుగుతున్న ఒబెసిటీ సమస్యపై జాతీయ పోషకాహార సంస్థ తీవ్ర ఆందోళన చెందుతున్నది. అయితే ఈ ఉబకాయాన్ని తగ్గించుకునేందుకు కొందరు కృత్రిమ పద్ధతుల ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల అనేక రకాల సమ్యలు ఎదురవుతాయని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. దీన్ని కొద్దివరకు తగ్గించాలంటే ప్రతీ చిన్నపనికి కారును, మోటారు సైకిల్ను వినియోగించకుండా సాధ్యమైనంత వరకు నడిస్తే మంచిదని చెబుతున్నారు.
వాకింగ్.. జాగింగ్..
ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై శ్రద్ధ ఉంటుంది. బతికినంతకాలం ఆరోగ్యంగా జీవించాలనే తపన ఉంటాయి. వ్యాధులను అధిగమించాలనే ఆసక్తి, లక్ష్యం ఉంటాయి. వీటన్నింటికీ ఒకటే మార్గంగా వాకింగ్, జాగింగ్ చేస్తూ క్రీడా మైదానాలు, పార్కుల వైపు పరుగులు తీస్తున్నారు. ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు కొంతమందికి చలి వాతావరణం అనుకూలించక పోవ డం, వయస్సు, శారీర తారతమ్యాలు, తదితర కారణాలతో బయటి ప్రాంతాలకు రాకుండా ఇంటి వరండాలు, వాకిళ్లు, డాబాలపై వాకింగ్, జాగింగ్ చేస్తున్నారు. మరికొంతమంది సంపన్నవర్గాలు పని ఒత్తిడి వల్ల తమకున్న ఖాళీ సమయంలో కొంత వెసులుబాటు కల్పించుకుని వ్యాయామం చేస్తున్నారు. హోమ్ జిమ్లను ఏర్పాటు చేసుకొని కుటుంబ సమేతంగా కసరత్తు చేస్తున్నారు. తమతమ ఆరోగ్యాన్ని, ఫిట్నెస్ను కాపాడుకునేందుకు ఇలా ఎవరికి తోచిన విధంగా వారు వ్యాయామంతో కుస్తీ చేస్తున్నారు. ప్రతిరోజూ కనీసం ఆరగంట అయినా జాగింగ్ చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది.
పౌష్టికాహారం తప్పనిసరి..
ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వ్యాయామంతోపాటు పౌష్టికాహారం తప్పనిసరి తీసుకోవాలి. సాధారణంగా నిత్యం తీసుకునే ఆహార పదార్థాల విషయాల్లో ఎటువంటి నియమాలు, పరిమితులు పాటించడం లేదనేవి జగమెరిగిన సత్యం. పౌష్టికాహార నియమాలు పాటించని 90 శాతం శరీరాలు విభిన్నరోగాలు, వ్యాధులబారిన పడుతున్నట్లు ఆరోగ్య సంస్థ నివేదికలు చెబుతున్నాయి. సమతుల్య ఆహారానికి ప్రాధాన్యం ఇచ్చినట్లయితే శరీరాన్ని రోగాల బారి నుంచి కాపాడుకోవచ్చు. ముఖ్యంగా నూనె పదార్థాలు పరిమితంగా వాడటం, మాంసకృత్తులు, ప్రొటీన్లు, కార్బోహైడ్రెడ్ సమపాళ్లలో లభించేలా పప్పు దినుసులు, కూరగాయాలు, పండ్లు తదితర పదార్థాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. మాంసాహారులు పప్పుదినుసుల స్థానంలో అప్పుడప్పుడు గుడ్డు, చేప, మాంసం తీసుకుంటే మంచిది.
ఫిట్నెస్ కోసం జిమ్ సెంటర్లకు..
కుర్రకారు సిక్స్ప్యాక్, ఫర్ఫెక్టు బాడీలతో వెర్రెత్తించాలనే ఆసక్తితో జిమ్లు, ఫిట్నెస్ సెంటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. యువత ఉత్సాహానికి అనుగుణంగా వ్యాయామ కేంద్రాలూ పెరిగాయి. శరీరాకృతికి అనువైన ఫిట్నెస్ పరికరాల వినియోగం పెరిగింది. ఉమ్మడి జిల్లాలోని పట్టణాల్లో జిమ్ సెంటర్లు వెలిశాయి. యువత అభిరుచులకు అనుగుణంగా అధునాతనమైన పరికరాలతో అక్కడ వ్యాయామం చేస్తున్నారు.
ఆరోగ్య నియమాలు..
మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉండాలంటే ఆహార పదార్థాలు వ్యాయామంతోపాటు ఆరోగ్య నియమాలు ముఖ్యభూమిక పోషిస్తాయి. ఆరోగ్య నియమాల్లో అతి ముఖ్యమైనవి చేతులు శుభ్రంగా కడుక్కోవడం, దేహపరిరక్షణ, మనంరోజూ ఎంతో మందితో కరచాలనం చేస్తుంటాం. ఏవేవో అపరిశుభ్ర ప్రదేశాలను మనకు తెలియకుండానే ముట్టుకుంటాం. నిత్యం చేసే పనులన్నీ దాదాపు చేతులతోనే కానిస్తాం. అవే చేతులతో ఏదో ఒకటి తింటుంటాం. అందుకే చేతులను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. కనీసం వారానికి ఒకసారి గోళ్లను కత్తింరించుకోవాలి. సామాన్యంగా కళ్లకు కనబడనంత సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపిస్తాయి. పనులు ముగించుకొని ఇంటికి చేరుకున్న వెంటనే ప్రతిఒక్కరూ చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి.
వృద్ధులకు ఇవి తప్పనిసరి..
వృద్ధులకు విశ్రాంతి, మానసిక ప్రశాంతత, శారీరక బలం అవసరం. అయితే వయస్సు మీద పడుతున్న కొద్దీ ప్రతీ వ్యక్తికి సాధారణంగానే కొన్ని సమస్యలు పెరుగుతూ ఉం టాయి. వృద్ధాప్యంలో శారీరక శ్రమ ఎక్కువగా ఉండదు. కాబట్టి కాలరీల సామర్థ్యం తగ్గుతున్నది. సాధారణ వ్యక్తులకు రెండు వేల కాలరీలు సామర్థ్యం అవసరం. అయితే వృద్ధాప్యంలో ఉన్నవారికి మాత్రం 1,800 కాలరీలు సరిపోతుంది. ఆహార పదార్థాల విషయానికొస్తే వృద్ధాప్యంలో నూనె, నెయ్యి, వెన్న, వనస్పతి వాడకం దాదాపుగా తగ్గించుకోవాలి. పాలు, పప్పు ధాన్యాలు, కోడిగుడ్డు తెల్లసొన మేలు చేస్తాయి. రోజుకు 200 నుంచి 300 మిల్లీలీటర్ల పాలు, పాల ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతో ఉపయుక్తం. కనీసం 400గ్రాముల కూరగాయలు, పండ్లు తినాలి. ఉప్పు, మసాలాలు బాగా తగ్గించాలి. కాల్షియం, విటమిన్-ఏ, జింక్ వృద్ధాప్య సమస్యలను అధిగమించడంలో సహాయ పడతాయి. వైద్యుల సహకారంతో వ్యాయామ పద్ధతులు ఎంచుకోవాలి.
సర్వరోగ నివారిణి యోగా..
అందమైన ఆరోగ్యానికి శాశ్వత సంజీవని యోగా అంటారు. యోగా అంటే కలయిక అని అర్థం. చక్కటి మానసిక ప్రశాంతత ఈ యోగాతోనే సాధ్యం. యమ, నయమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహర, ధారణ, ధ్యాన, సమాధి అని ఎనిమిది విధానాలు యోగాలో ఉంటాయి. వీటిని అష్టాంగా యోగం అని అంటాం. మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, కీళ్లనొప్పులు, వెన్నునొప్పి, తదితర సమస్యలన్నింటికీ చక్కని పరిష్కార మార్గం యోగా. దీర్ఘకాలిక, మొండి వ్యాధులను తగ్గించే శక్తియోగాకు ఉందని నిపుణులు అంటున్నారు. జీర్ణకోశ వ్యాధులు, నీరసం, నిద్రలేమి, నరాల బలహీనత వంటి రుగ్మతల నుంచి తేలికగా బయటపడే వీలు ఉంటుంది. యోగా ద్వారా ధూమపానం, మద్యపానం వంటి దురలవాట్లను కూడా మాన్పించవచ్చు అని యోగా గురువులు చెబుతున్నారు. ఉదయం 5 నుంచి 7గంటల లోపు 45 నిముషాలపాటు క్రమం తప్పకుండా యోగా చేయడంతోపాటు అరచేతులు, అరికాళ్లపై తగినవిధంగా మర్థనా చేస్తే అంతుచిక్కని వ్యాధులు మాయమై, రోగాలతో ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.