వర్షపు నీటితో వాగు ప్రవాహాల్లో.. చెరువు అలుగుల్లో.. రిజర్వాయర్ దిగువ నీటిలో ఎక్కడ చూసినా చేపలే.. చెంగు చెంగున ఎగురుతూ.. నీటికి ఎదురెక్కుతూ వలలకు చిక్కుతున్నాయి. పాత నీటికి కొత్త నీరు తోడు కావడంతో గతంలో ఉన్న చెద్ద చేపలు కిలోలకొద్దీ జాలరులకు దొరుకుతున్నాయి. మాంసం ప్రియులు సైతం ఎప్పుడూ మార్కెట్లో లభించే మాంసం, చికెన్ వర్షాల సీజన్లో కాస్త పక్కన పెట్టి విటమిన్లు ఎక్కువ కలిగిన చేపలనే నోరారా తినేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. భారీ వర్షాలతో చెరువులు, వాగుల సమీపంలో నీటిలో లభించిన చేపలను తూకం లేకుండానే రూ.100 నుంచి సైజునుబట్టి విక్రయిస్తున్నారు. మత్స్యకారులే కాక రైతులు, మహిళా కూలీలు, ప్రజలు కూడా నీటిలో వీటిని పట్టేందుకు ఉత్సాహం చూపుతున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 29 (నమస్తే తెలంగాణ)/కూసుమంచి/వైరా టౌన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వానలు జోరుగా కురుస్తున్నాయి. చెరువులు, జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. గోదావరితోపాటు వాగులు, వంకలు పొంగి ప్రవాహిస్తున్నాయి. చెరువులు అలుగు పోస్తున్నాయి. వరద నీటిలో చేపలు కుప్పలు తెప్పలుగా ఎగసి పడుతున్నాయి. దీంతో గ్రామస్తులు, మత్స్యకారులు చెక్డ్యాంలు, చెరువులు, వాగుల వద్ద చేపలు పడుతూ సందడి చేస్తున్నారు. వలలు, గేలాలతో చేపలను వేటాడుతున్నారు. కొన్నిచోట్ల కిలో నుంచి పది కిలోల చేపల వరకు వలకు చిక్కుతున్నాయి. తాజా చేపలను కొనేందుకు ‘మత్స్య’ ప్రియులు ఆసక్తి చూపుతున్నారు. మత్స్యకారులు డిమాండ్ను బట్టి కిలో చేపలను రూ.100- రూ.125 వరకు విక్రయిస్తున్నారు. సీజన్ ఫుడ్ కావడంతో మాంసం ప్రియులు చికెన్, మటన్ను పక్కన పెట్టి చేపలు తింటున్నారు. ఉభయ జిల్లాల్లోని వైరా, పాలేరు రిజరాయర్లు, కిన్నెరసాని వాగు, ప్రధాన చెరువుల వద్ద అతి తక్కువ ధరకు చేపలు లభిస్తున్నాయి.
రోజుకు 30 కిలోల చేపలు
పాలేరుకు వరద రావడంతో చేపలు బాగా దొరుకుతున్నాయి. ప్రతి మత్స్యకారుడికి రోజుకు సుమారు 30 కిలోల వరకు చేపలు దొరికాయి. మేం ఒక కిలో చేపలను రూ.100 చొప్పున విక్రయించాం. ప్రస్తుతం చేపలకు మార్కెట్లో డిమాండ్ ఉంది. పాలేరు మీదుగా ఖమ్మం, సూర్యాపేట వెళ్లే ప్రయాణికులు జలాశయం వద్ద ఆగి మరి చేపలు కొంటునాన్రు.
-బత్తుల ఉప్పయ్య, మత్స్యకారుడు, కూసుమంచి మండలం
కిన్నెరసాని చేపకు మంచి గిరాకీ
చెరువుల్లో పెరిగిన చేపల కంటే కిన్నెరసాని వాగులో దొరికే చేపలకు మంచి డిమాండ్ ఉంటుంది. గతంలో మాకు ఫోన్ చేసి మరీ కిన్నెరసాని చేపలు ఉన్నాయా అని అడిగిమరీ తీసుకెళ్లేవారు. ఇప్పుడు కూడా కిన్నెరసాని వాగులో దొరికిన చేపలు హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయి. ప్రస్తుత సీజనల్లో చేపల అమ్మకాలు ఆశాజనకంగా ఉన్నాయి.
– నగేశ్, చేపల విక్రయదారుడు, మైలారం, లక్ష్మీదేవిపల్లి మండలం
లాభదాయకంగా ఉంది
రాష్ట్ర ప్రభుత్వం వైరా రిజర్వాయర్లో చేప పిల్లలు పోసి మత్స్యకారులకు మంచి చేస్తున్నది. ప్రస్తుతం చేపల వేట మాకు మంచి ఉపాధిస్తున్నది. రిజర్వాయర్లో కొత్త నీరు చేరడంతో రకరకాల చేపలు దొరుకుతున్నాయి. ప్రస్తుతం జలాశయంలో కిలో సైజు నుంచి మూడు కిలోల సైజు చేపలు పడుతున్నాం. చేపలు విక్రయించి మేం కుటుంబాలను పోషించుకుంటున్నాం. చేపల వేట లాభదాయకంగా ఉంది.
– రహీం, మత్స్యకారుడు, వైరా
వానకాలంలో చేపలు పడతా
నేను వానకాలంలో చేపలు పడతా. ప్రస్తుత వరదల కారణంగా బూర్గంపహాడ్ మండలంలోని వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. నేను గ్రామస్తులతో కలిసి చేపల వేటకు వెళ్లాను. ఇటీవల మా వలకు 20 కిలోల చేప చిక్కింది. నేను మా కుటుంబానికి ఉంచి మిగతాదంతా బంధువులు, స్నేహితులకు పంచాను. ఇక అందరి ఇళ్లలోనూ చేపల ఘుమఘుమలే.
– గుండె వెంకన్న, బూర్గంపాడు మండలం.