ఖమ్మం : నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే సమయంలో ఇతరుల్ని ఇబ్బందిపెట్టవద్దని ఖమ్మం పోలీసు కమిషనర్ విష్ణు యస్. వారియర్ కోరారు. ఒమిక్రాన్ వ్యాపి నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ,నూతన సంవత్సర వేడుకలు సజావుగా జరుపుకుంటూ పోలీసులకు సహకారించాలని ఆయన సూచించారు.
జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా పటిష్టమైన పోలీసుబందోబస్తు,అన్ని ప్రాంతాలలో పోలీస్ పెట్రోలింగ్, విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలునిర్వహిస్తామని, ఎవరైనా మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే కేసులు నమోదు చేయాలని అధికారులకు ఆదేశించిచారు కమిషనర్.
వేడుకలలో మితిమీరిన వేగంతో డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాల బారీన పడి కుటుంబాలలో విషాదం నింపే పరిస్ధితి తీసుకొని రాకుండా ప్రతి పౌరుడు బాధ్యతగా వేడుకలు జరుపుకోవాలని సూచించారు. రాత్రి నిర్ణీత సమయంలోనే మద్యం దుకాణాలు, దాబాలు, బార్లు, రెస్టారెంట్లు,హోటళ్లు మూసివేయాలన్నారు. ప్రధాన కూడళ్లలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. వాహన చోదకులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని, ర్యాలీలు, బాణాసంచా పేల్చడానికి అనుమతి లేదని తెలిపారు.