కొత్తగూడెం సింగరేణి, మార్చి 12 : సింగరేణి ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఏడాదిలో సింగరేణి ఆధ్వర్యంలో దాదాపు 1,900 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. ఇందులో గత వారం 489 ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ అయ్యాయని, మరో 1,352 ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు పేర్కొన్నారు.
మంగళవారం హైదరాబాద్లోని బంజార హిల్స్లో నిర్మించనున్న సింగరేణి అతిథి గృహం శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 134 ఏళ్ల చరిత్ర ఉన్న సింగరేణి సంస్థకు హైదరాబాద్లో అతిథి గృహం లేకపోవడం బాధాకరమన్నారు. కార్మికులు, అధికారుల ప్రయోజనార్థం రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి గజాల స్థలాన్ని కేటాయించిందన్నారు. కార్యక్రమంలో సీఎండీ బలరాంనాయక్, డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.