ఖమ్మం, జనవరి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/భద్రాద్రి కొత్తగూడెం, (నమస్తే తెలంగాణ): ఫస్ట్ వేవ్లో కరోనా అంటేనే హడల్.. పాజిటివ్ వచ్చిందంటే చాలు ప్రాణ భయం.. యంత్రాంగంలో మిగతా వారికి ఎక్కడ అంటుకుంటుందోనన్న ఆందోళన.. కొందరైతే పాజిటివ్ వచ్చి కేవలం భయంతోనే చనిపోయారు. ఇదే భయాన్ని పెట్టుబడిగా మలుచుకున్న ప్రైవేట్ ఆస్పత్రులు నిలువు దోపిడీకి పాల్పడ్డాయి. పాజిటివ్ తేలిన వారి ఇంటి ముందు పారిశుధ్య సిబ్బంది బ్లీచింగ్ పౌడర్ చల్లేవారు. ఫస్ట్ కాంటాక్ట్, సెకండ్ కాంటాక్ట్ అంటూ అందరినీ వెతికి పట్టుకుని కొవిడ్ పరీక్షలు చేయించేవారు. పాజిటివ్ బాధితులు ఉంటున్న ఇంటి వైపు ముళ్లకంపలు వేసేవారు. సెకండ్ వేవ్లో అయితే ఆక్సిజన్ సిలిండర్ల కొరత. రెమిడెసివర్ల కొరత. ప్రైవేటు ఆస్పత్రుల్లో బ్లాక్ మార్కెట్లో రెమిడెసివర్ల అమ్మేవారు. రెమిడెసివర్ల మాఫియా ఏకంగా పెద్ద దందానే నడిపాయి. ఫస్ట్, సెకండ్ వేవ్ల్లో కరోనా మరణాల సంఖ్య కూడా ఎక్కువగా గానే ఉండేది. చనిపోయిన వారిని బంధువులు, కుటుంబ సభ్యులు ఆమడ దూరంలో ఉండి ఖననం చేసేవారు. కొందరైతే సొంత కుటుంబ సభ్యులు చనిపోయినా కనీసం చివరి చూపు సైతం చూడలేదు. ఎప్పుడు ఏ మరణవార్త వింటామా.. అనే ఆందోళన ప్రజలందరిలో ఉండేది. ఇంకా లాక్డౌన్ల సంగతి చెప్పనక్కర్లేదు. ప్రైవేటు, ప్రభుత్వ రంగాలన్నీ కుదేలయ్యాయి. లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. సెకండ్ వేవ్ వచ్చిన కొంత కాలానికి కొవిడ్ కేసులు తగ్గాయి. ప్రభుత్వం లాక్డౌన్ను ఎత్తివేసింది. ఇక అంతా బాగానే ఉందని భావిస్తున్న సమయంలో ఒమిక్రాన్ అనే కొత్త వేరియంట్ వచ్చింది. ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఇది ఇలా ఉండగానే తిరిగి కొవిడ్ కేసులు కూడా పెరుగుతున్నాయి.
ప్రభుత్వ పటిష్ట చర్యలు..
ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ కేసులను కట్టడి చేసేందుకు వైద్యారోగ్యశాఖను అప్రమత్తం చేశారు. ఇప్పటికే ఇంటింటి జ్వర సర్వే చేపడుతున్నారు. వైద్యారోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు ఇంటింటికీ వెళ్లి గ్రామస్తులతో మాట్లాడుతున్నారు. కొవిడ్ లక్షణాలు ఉన్న వారికి అప్పటికప్పుడే మెడికల్ కిట్లు ఇస్తున్నారు. మరోవైపు వైద్యారోగ్యశాఖ పీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో టెస్టుల సంఖ్య పెంచింది. నిరంతరం వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపడుతున్నది.
ఖమ్మం జిల్లాలో..
గడిచిన 25 రోజుల్లో జిల్లావ్యాప్తంగా 1,07,327 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా 7,478 మందికి పాజిటివ్ తేలింది. రోజుకు 1,554 బృందాలు గ్రామగ్రామాన పర్యటించి జ్వర పీడితులను గుర్తిస్తున్నారు. సోమవారం నాటికి బృందాలు 2,68,737 ఇండ్లను సర్వే చేసి 9,956 మంది లక్షణాలు కలిగిన వారికి మెడికల్ కిట్లు అందజేశారు. సోమవారం నాటికి జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 11,40,138 మందికి ఫస్ట్ డోస్, 9,84,763 మందికి సెకండ్ డోస్, టీనేజర్లకు 73,789 మందికి టీకా అందింది. మరోవైపు ఫ్రంట్లైన్ వారియర్స్, ఆరోగ్య కార్యకర్తలు, 60 ఏండ్లు నిండిన సీనియర్ సిటిజన్స్, సెకండ్ డోస్ పూర్తయి తొమ్మిది నెలలు పూర్తయిన వారికి వైద్యసిబ్బంది బూస్టర్ డోసూ వేస్తున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రతిరోజూ వేలాది మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
భద్రాద్రి జిల్లాలో..
భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 1,074 బృందాలు జ్వర సర్వే చేపడుతున్నాయి. సిబ్బంది ఇప్పటివరకు 1,51,457 మంది కుటుంబాలను కలిసి 9,119 మందికి అక్కడికక్కడే మెడికల్ కిట్లు పంపిణీ చేశారు. 52,318 మందికి టీనేజర్లకు ఇప్పటికే 38,287 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. సెకండ్ డోస్ 1,38,232 మందికి వేయాల్సి ఉండగా ఇప్పటివరకు 1,26,504 మందికి టీకా అందింది. ప్రికాషన్ డోస్ 44,118 మందికి అందాల్సి ఉండగా 14,818 మందికి అందింది. కొవిడ్ మొదటి వేవ్లో 3,11,688 మందికి కొవిడ్ టెస్టులు నిర్వహించగా 25,073 మందికి పాజిటివ్ తేలింది. 24,953 మంది రికవరీ అయ్యారు. 120 మంది మృత్యువాత పడ్డారు. సెకండ్ వేవ్లో 5,17,505 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 22,614 మందికి పాజిటివ్ తేలింది. 21,592 మంది రికవరీ అయ్యారు. 261 మృత్యువాత పడ్డారు. గడిచిన 25 రోజుల్లో 5,086 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 432 మందికి పాజిటివ్ తేలింది. 420 మంది రికవరీ అయ్యారు. ఇప్పటివరకు ఒక్క మరణం కూడా నమోదు కాలేదు.
మంత్రి పువ్వాడ అజయ్ పర్యవేక్షణ..
ఇంటింటి జ్వర సర్వే, వ్యాక్సినేషన్, కొవిడ్ పరీక్షలను మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఉభయ జిల్లాల కలెక్టర్లు గౌతమ్, అనుదీప్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బందిని నిత్యం సమీక్షిస్తున్నారు. మంగళవారం ఖమ్మం నగరంలోని పలు డివిజన్లలో మంత్రి అజయ్ పర్యటించారు. జ్వర సర్వేపై సిబ్బందికి సలహాలు, సూచనలిచ్చారు. స్వయంగా నగరవాసులతో మాట్లాడారు. కొవిడ్ వచ్చినా భయపడాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు.
అప్రమత్తంగా ఉండాలి..
పాజిటివ్ తేలిన వారిలో ఎక్కువ మంది హోం ఐసొలేషన్లోనే ఉంటున్నారు. వైద్యారోగ్యశాఖ అందజేసిన మెడికల్ కిట్లు వినియోగించి రికవరీ అవుతున్నారు. ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య చాలా తక్కువగా ఉన్నది. ఈ వేవ్లో మరణాలు లేకపోవడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. అయినప్పటికీ ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాలని, బయట ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించాలని వైద్యారోగ్యశాఖ సూచిస్తున్నది.
ఆరోగ్యం నిలకడగా ఉంది..
ఇప్పటికి నాకు రెండుసార్లు కొవిడ్ పాజిటివ్ తేలింది. మొదటి సారి కొవిడ్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డా. ఊపిరి తీసుకోలేక ఇబ్బందిపడ్డాను. రెండోసారి పాజిటివ్ వచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేవు. ప్రభుత్వం ఇచ్చిన మందులు వాడుతున్నాను. ఆరోగ్యం నిలకడగా ఉంది. నాకు కిడ్నీ సమస్య ఉంది. ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందుతున్నది.