మేడ్చల్, శామీర్పేట, ఆగస్టు 14(నమస్తే తెలంగాణ): : రైతులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని మాజీ మంత్రి మల్లారెడ్డి హెచ్చరించారు. రైతుల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం గుంజుకునే ప్రయత్నాన్ని ఆపకపోతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కలిసి ఉద్యమిస్తామన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్పేట్ తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో రైతులకు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి నమ్మి ఓటేసిన పాపానికి పగటి దొంగల లెక్క భూములను లూటీ చేస్తున్నారని ఆరోపించారు. 50-60 ఏండ్లుగా సాగులో ఉండటంతో నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలు, ఎన్వోసీలు, ధరణి పాస్పుస్తకాలు ఉన్నా.. 1049 ఎకరాల భూములను 22 ఏ నిషేధిత జాబితాలో చేర్చారన్నారు. ఇప్పటికే రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో దాదాపు కోటి ఎకరాల పైచిలుకు 22 ఏలోకి తీసుకున్నారన్నారు. బొమ్మరాసిపేట రైతులకు 22 ఏ రికార్డు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అన్యాయానికి గురి చేస్తుందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం భూములను లాక్కోవడమే పనిగా పెట్టుకున్నదని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ధ్వజమెత్తారు. ఈ మహాధర్నాలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, బీఆర్ఎస్ పార్లమెంట్ ఇన్చార్జి లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జహంగీర్, మూడుచింతలపల్లి మున్సిపల్ చైర్మన్ జాము రవి, మాజీ మేయర్ కావ్య, మాజీ చైర్మన్లు రాజేశ్వర్రావు, పావని, మాజీ ఎంపీపీ ఎల్లూబాయిబాబు, మాజీ జడ్పీటీసీ అనితలాలయ్య తదితరులు పాల్గొన్నారు.