కేసముద్రం, ఏప్రిల్ 21 : మోసకారి కాంగ్రెస్ పార్టీని రైతులు నమ్మొద్దని, రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి, అధికారంలో వచ్చిన తర్వాత దాటవేత ధోరణితో రైతులను గోస పెడుతున్నదని మహబూబాబాద్ ఎంపీ, బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి మాలోత్ కవిత అన్నారు. ఆదివారం కేసముద్రం మండల కేంద్రంలో జరిగిన మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్, మాజీ ఎమ్మెల్యే శంకర్నాయక్తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో మండువేసవిలోనూ చెరువులు మత్తడి పోశాయని, కాంగ్రెస్ పాలనలో చుక్క నీరు లేక వెలవెలబోతున్నాయన్నారు. వేల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగుచేసిన పంటలు ఎండిపోయి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని అన్నారు. ఆగస్టు 15న వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డి ఏ సంవత్సరం ఆగస్టు నెలలో చేస్తారో స్పష్టంగా ప్రకటించాలని కోరారు. గతేడాది వానకాలంలో సాగు చేసిన వరికి క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి వచ్చే ఏడాది ఇస్తామంటున్నారని, రైతులు గమనించాలన్నారు. పేదింటి ఆడబిడ్డలకు అండగా ఉండేందుకు సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి ద్వారా రూ.లక్షా 116 అందిస్తే, రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పటికీ అమలుచేయడం లేదన్నారు. ఓటు వేసే ముందు తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో కలుపుతామని చెప్పిన బలరాంనాయక్ మాటలను గుర్తు చేసుకోవాలన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న బలరాంనాయక్ ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ లు రెండు జాతీయ పార్టీలని, వాటితో తెలంగాణ హక్కులను సాధించలేమన్నారు. మీ ఇంటి ఆడబిడ్డగా తన గెలుపునకు కృషి చేయాలని కోరారు. ఈ నెల 23న తన నామినేషన్ కార్యక్రమానికి అధికసంఖ్యలో తరలిరావాలని కోరారు.
ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి మానుకోటకు వచ్చిన సీఎం రేవంత్రెడ్డి అభివృద్ధికి నిధులు ఇవ్వని విషయాన్ని ఈ ప్రాంత ప్రజలు గుర్తుంచుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ అన్నారు. కేసీఆర్ సీఎంగా మొదటిసారి మానుకోటకు వచ్చినప్పుడు హార్టికల్చర్ యూనివర్సిటీ, మెడికల్, ఇంజినీరింగ్ కళాశాల నిర్మిస్తామని హామీ ఇచ్చి, నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇటీవల మానుకోటలో జరిగిన సీఎం సభకు జనం రాకపోవడంతో రెండు గంటల పాటు సీఎం రేవంత్రెడ్డి బస్సులోనే ఉండిపోయారని అన్నారు. కమీషన్ల కోసమే మెడికల్ కళాశాల నిర్మిస్తున్నారని చెబుతున్న ఎమ్మెల్యే మురళీనాయక్ గర్భిణులకు ఆపరేషన్లు చేసి ఎంత డబ్బు గుంజుతున్నాడో మీ అందరికీ తెలుసునన్నారు.
మాజీ ఎమ్మెల్యే శంకర్నాయక్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వ పనితీరును, సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వ పనితీరును ప్రజలు బేరీజు వేసుకోవాలన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వంద రోజుల్లో ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదన్నారు. కార్యక్రమంలో మార్క్ఫెడ్ డైరెక్టర్ మర్రి రంగారావు, ఎంపీపీ ఓలం చంద్రమోహన్, జడ్పీటీసీ రావుల శ్రీనాథ్రెడ్డి, మండల అధ్యక్షుడు నజీర్ అహ్మద్, బీఆర్ఎస్ నాయకుడు భరత్కుమార్రెడ్డి, ఊకంటి యాకూబ్రెడ్డి, రావుల రవిచందర్రెడ్డి, జాటోత్ హరీశ్నాయక్, మోడెం రవీందర్గౌడ్, శ్రీనివాస్, సట్ల వెంకన్న, అన్నెపాక వెంకన్న, నర్సయ్య, రామ్మూర్తి, ఆగె వెంకన్న, ఘనపారపు రమేశ్, లింగాల పిచ్చయ్య, గుంజపొడుగు కొమ్మన్న, కూన భద్రాద్రి పాల్గొన్నారు.