చింతకాని, మార్చి 22 : రైతులు యాసంగి సీజన్లో వరికి బదులుగా ఆరుతడి పంటలు వేసి అధిక ఆదాయం పొందవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్ సైంటిస్ట్లు ఎం.గోవర్ధన్, ఆర్.ఉమారెడ్డి అన్నారు. రామకృష్ణాపురంలో క్లస్టర్ రైతులకు యాసంగిలో వరికి బదులుగా వేయాల్సిన ఆరుతడి పంటలు, సమగ్ర యాజమాన్య పద్ధతులపై శుక్రవారం ఒకరోజు శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్కెట్లో డిమాండ్ ఉన్న కంది, మినుములు, పెసలు తదితర పంటలను వేసి వ్యవసాయాధికారుల సూచనలు పాటిస్తూ లాభాలు గడించాలన్నారు. యాసంగి ఆరంభంలో పొలాల్లో చెత్తను తగులబెట్టడం వల్ల భూసారం దెబ్బతింటుందని, పై పంటలు వేయడం వల్ల పొలాల్లో నత్రజని పోషకాలు పుష్కలంగా నిల్వ అవుతాయని పేర్కొన్నారు. రసాయన ఎరువుల వాడకం వల్ల భూమి నిస్సారం అవుతుందని, ఇందుకోసం రైతులు సేంద్రియ ఎరువుల వాడకం పెంచాలన్నారు. అనంతరం జీరో టిల్లేజ్ పద్ధతి ద్వారా మక్క సాగుపై క్షేత్ర పరిశీలన చేసిన శాస్త్రవేత్తలు సాగు రైతులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి ఎం.విజయనిర్మల, వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు ప్రగతికుమార్, శైలజ, కిరణ్రెడ్డి, భరత్, నాగస్వాతి, చిరంజీవి, రాణా, రవికుమార్, పల్లెల నాగయ్య, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.